- రూ.1,21,659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం చాంబర్లో ఈరోజు (గురువారం) 4వ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి వస్తున్న కొత్త పెట్టుబడి ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.
అలాగే, గత మూడు SIPB సమావేశాలలో ఆమోదిం పొందిన ప్రాజెక్టులు, వాటి పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. కాగా, ఇప్పటికే ఆమోదం తెలిపిన, ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల పురోగతిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని.. దీని కోసం ఒక ట్రాకర్ను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
పరిశ్రమ, విద్యుత్, పర్యాటకం వంటి రంగాలలోని మొత్తం 10 కంపెనీలు రూ.1,21,659 కోట్ల పెట్టుబడులతో ముందుకురాగా ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఇవి 80,104 మందికి ఉపాధి మరియు ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి.
4వ ఎస్ఐపీబీ ఆమోదం పొందిన సంస్థల వివరాలివే :
➢ ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ : నాయుడుపేట – రూ.1,742 కోట్ల పెట్టుబడులు, 2,000 ఉద్యోగాలు.
➢ దాల్మియా సిమెంట్ : కడప జిల్లా – రూ.2,883 కోట్ల పెట్టుబడులు, 354 ఉద్యోగాలు.
➢ లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్ : విశాఖపట్నం – రూ. 1,500 కోట్ల పెట్టుబడులు.
➢ సత్యవీడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ : శ్రీసిటీ – రూ. 25,000 కోట్ల పెట్టుబడులు, 50,000 ఉద్యోగాలు.
➢ ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ : రూ.58,469 కోట్ల పెట్టుబడులు, 13,050 ఉద్యోగాలు.
➢ బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ : రూ.1,175 కోట్లు, 1,500 ఉద్యోగాలు.
➢ ఏపీ ఎన్జీఈఎల్ హరిత్ అమ్రిత్ లిమిటెడ్ : అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు – రూ.22,000 కోట్ల పెట్టుబడులు, 8,300 ఉద్యోగాలు
➢ ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ : అన్నమయ్య, కడప జిల్లాలు – రూ.8,240 కోట్లు, 4,000 ఉద్యోగాలు.
➢ మేఫెయిర్ బీచ్ రిసార్ట్స్, కన్వెన్షన్ : రూ. 400 కోట్ల పెట్టుబడులు, 750 ఉద్యోగాలు.
➢ ఒబేరేయ్ విలాస్ రిసార్ట్ : రూ. 250 కోట్ల పెట్టుబడులు, 150 ఉద్యోగాలు.
తక్షనమే MSME పార్కులను వెంటనే ఏర్పాటు చేయాలి…
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక MSME (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్) పార్కు చొప్పున మొత్తం 175 నియోజకవర్గాల్లో MSME పార్కులను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
దీనిలో భాగంగా, జిల్లాకు ఒకటి చొప్పున 26 జిల్లాల్లో 26 MSME పార్కులను వెంటనే ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఇప్పటికే ప్రతిపాదించిన రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్లను.. రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో 5 సెంటర్లను నెల రోజుల్లోగా ఏర్పాటు చేయాలన్నారు.
ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడంతో పాటు, ఆయా ప్రాజెక్టులు క్షేత్ర స్థాయిలో పనిచేయడం ప్రారంభించేలా చూసుకోవాలని అన్నారు. ఈ విషయంలో మంత్రులు, అధికారులు మరింత వేగంగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అప్పుడే ప్రతి సంవత్సరం పురోగతి, ఫలితాలు కనిపిస్తాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నారా లోకేష్, కె.అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, టి జి భరత్, పి.నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.