అమరావతి – సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకే బాగుంటాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. వాటిని ఆచరణలో పెడతామని, , ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తామని అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అలా చేస్తే అన్న వారిని, చేసిన వారిని కూడా లోపలేస్తామని తెలిపారు.. ఏపీ మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటనలో ‘‘గంగమ్మ తల్లి జాతరలో యాట తల నరికినట్లు రప్పా రప్పా నరుకుతా’’ అంటూ వైసీపీ శ్రేణులు ప్లకార్డులు ప్రదర్శించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వైఎస్ జగన్ అది సినిమా డైలాగ్ అని సమర్ధించారు. పుష్ప సినిమాలోని అనే డైలాగ్ అని మీడియాతో వెల్లడించారు. అలా ప్లకార్డ్ ప్రదర్శించడం తప్పుకాదంటూ ఆ కార్యకర్తను వెనకేసుకొచ్చారు..
దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలు పాటించాల్సిందే. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తుల పై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదు. కచ్చితంగా అలాంటి వారిపై రౌడీ షీట్లు తెరిచి.. అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని పేర్కొన్నారు.
అశాంతిని, అభద్రతను కలిగించే వారికి మద్దతుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్న వారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసే వారిని కట్టడి చేయకపోగా.. వారిని సమర్థించేలా మాట్లాడేవారి నేరమయ ఆలోచనలను ప్రజలంతా గమనించాలని పవన్ కల్యాణ్ సూచించారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని మరచిపోవద్దని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు గుర్తు చేశారు.