AP ECET- 2025: ఏపీ ఈసెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల

అనంత‌పురం : జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్) – 2025 షెడ్యూల్‌ను ఇవాళ‌ విడుదల చేశారు. ఈసెట్ పరీక్షను మే 6వ తేదీన నిర్వహించనున్నట్లు జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సుదర్శనరావు మీడియాకు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.

మే 6వ తేదీన రెండు సెషన్లలో ఈసెట్ పరీక్ష జరుగుతుందని వీసీ వివరించారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో విడత పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,187 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారి కోసం 110 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామని తెలిపారు. హైదరాబాద్‌లో కూడా ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిబంధనలను కచ్చితంగా పాటించాలని వీసీ సుదర్శనరావు సూచించారు. పరీక్ష ప్రారంభ సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా కేంద్రంలోకి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు గంటన్నర ముందుగానే తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష హాలులోకి క్యాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని ఆయన తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *