అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ మధ్య కీలక సమావేశం జరిగింది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలక అంశాలు, ముఖ్యంగా పొగాకు రైతుల సంక్షేమం, పంటలకు మద్దతు ధరలు, కేంద్రం నిధుల మంజూరు వంటి అంశాలను ప్రాధాన్యతగా చర్చించారు.
అదేవిధంగా వ్యవసాయం, ఎగుమతులు, దిగుమతులు, పన్నుల కోసం సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రిని కోరారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రికి వివరించారు.
పొగాకు రైతుల కోసం ప్రత్యేక నిధులు
పొగాకు రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీల కొనుగోళ్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. ఇందులో భాగంగా టోబాకో బోర్డు ద్వారా రూ.150 కోట్ల కేంద్ర సాయం అందించాలని సీఎం చంద్రబాబు గోయల్కు విజ్ఞప్తి చేశారు. అలాగే, పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ను నియంత్రించేందుకు చట్ట సవరణలు అవసరమని చెప్పారు.
పామాయిల్ దిగుమతులపై సుంకం తగ్గింపు కోరిన సీఎం
పామాయిల్ దిగుమతులపై ప్రస్తుతం అమలులో ఉన్న 10% దిగుమతి సుంకాన్ని తగ్గించాలని సీఎం కోరారు. పామాయిల్ రైతులకు నష్టాలు తగ్గించాలనే దృష్టితో, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలపై ఆందోళన
ఆంధ్రప్రదేశ్కు కీలకమైన ఆక్వా పరిశ్రమపై అమెరికా 27% దిగుమతి సుంకాలు విధించడంతో రాష్ట్రంలోని 8 లక్షల మంది ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సీఎం తెలిపారు. కేంద్రం, అమెరికా మధ్య చర్చలు జరిపి ఈ సుంకాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని గోయల్ను కోరారు. అలాగే, రాష్ట్రంలో భారీగా ఉత్పత్తి అయ్యే మామిడి గుజ్జుపై ప్రస్తుతం ఉన్న 12% జీఎస్టీని 5%కి తగ్గించాలని సీఎం సూచించారు. ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో పాటు సీఎం చంద్రబాబు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గళ్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు.