AP – ఏరో స్పేస్, డిఫెన్స్ రంగంలో రూ 22 వేల కోట్ల పెట్టుబ‌డి – చంద్రబాబు

ఇప్ప‌టికే 22 సంస్థ‌ల కార్య‌క‌లాపాలు ప్రారంభం
మ‌రిన్ని కంపెనీలు రావాల‌న్న చంద్ర‌బాబు
ఈ రెండు రంగాల‌పై ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌

వెల‌గ‌పూడి – రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఏరోస్పేస్, డిఫెన్స్ రంగం ఎంతో కీలకమని, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కల్పించడం ద్వారా మరిన్ని సంస్థలను ఆకర్షించవచ్చని అభిప్రాయపడ్డారు ఎపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేలా స్పష్టమైన కార్యాచరణతో, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా నూతన పాలసీ ఉండాలని ఆయన సూచించారు.

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగానికి సంబంధించిన విధానంపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా రాబోయే ఐదేళ్లలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఒక సమగ్రమైన నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏరోస్పేస్ , డిఫెన్స్ రంగంలో 23 సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని, వీటి ద్వారా ఇప్పటికే సుమారు 22 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సమకూరాయని సమావేశంలో అధికారులు వెల్లడించారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు అనువైన వ్యూహాలను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్‌లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నూతన పాలసీ ముసాయిదాను త్వరితగతిన పూర్తిచేసి, ఆమోదం కోసం కేబినెట్ ముందు ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Leave a Reply