అమలాపురం | : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేడు పర్యటించనున్నారు.. ముమ్మిడివరం మండలం చెయ్యేరు వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి..ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి.. నేరుగా పెన్షన్ అందించనున్నారు..
కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం 12:50 గంటలకు ముమ్మిడివరం మండలం సి.హెచ్.గున్నేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్లో సీఎం దిగనున్నారు.
అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:05 గంటలకు కాట్రేనికోన మండలం చెయ్యారులో ఉపాధి హామీ పథకంలో పూడికతీత తీసే ఉపాధి కూలీలతో మాటామంతి నిర్వహిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు అర్హులకు పింఛన్ పంపిణీ చేయనున్నారు. అదే గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్తులతో సమావేశం కానున్నారు
ముఖ్యమంత్రి.అక్కడే జిల్లాకు సంబంధించి పేదల సేవలో – బంగారు కుటుంబ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సీహెచ్ గున్నేపల్లి గ్రామంలో 3:35 గంలకు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పాల్గొననున్నారు. 5:15 గంటలకు గున్నేపల్లి హెలిప్యాడ్ నుంచి తిరిగి ప్రయాణం కానున్నారు. జిల్లాలో సుమారు ఐదు గంటల పాటు సీఎం పర్యటన జరగనుంది