అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీలో నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు విషెస్ తెలిపారు.
“పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న యువ స్నేహితులందరికీ శుభాకాంక్షలు. ఈ పరీక్షలు మీ విద్యా ప్రయాణంలో కీలకమైన మైలురాయి. దృష్టి కేంద్రీకరించండి, కష్టపడి పనిచేయండి.. మీ సమయాన్ని తెలివిగా సద్వినియోగం చేసుకోండి. మీపై నమ్మకం ఉంచుకోవడం మర్చిపోవద్దు, విజయం మీ వెంటే ఉంటుంది.” అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
విజయీభవ అంటూ లోకేష్ ట్వీట్
పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ చక్కగా పరీక్షలు రాయాలని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ”సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోండి. ఎటువంటి ఒత్తిడికి గురికావద్దు” అని ఎక్స్ వేదికగా విద్యార్థులకు మంత్రి లోకేష్ సూచించారు.
ఇన్నాళ్లు మీరు చదివిన కష్టం ఫలితాల రూపంలో వచ్చే పరీక్ష సమయం ఇది. ప్రశాంతంగా ఉండండి అని సూచనలు చేశారు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో పరీక్ష పూర్తి చేయండి. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీరు, సౌకర్యాలు ఏర్పాటు చేసాం.. విజయీభవ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.
ఏపీలో పదో తరగతి పరీక్షలు రేపు (మార్చి 17) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.