​ఏప్రిల్‌ నాటికి వంశధార ఎత్తిపోతల పూర్తి

​ఏప్రిల్‌ నాటికి వంశధార ఎత్తిపోతల పూర్తి

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

హీరమండలం శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : గొట్టా బ్యారేజీ వద్ద వంశధార ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేసి, రానున్న ఏప్రిల్ నాటికి పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం ఆయన హీరమండలం మండలంలో పర్యటించి, జలాశయానికి నీటిని తరలించే ఎత్తిపోతల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పథకానికి సంబంధించిన విద్యుత్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని, జలాశయం భవిష్యత్తులో జిల్లాకే తలమానికంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా, హీరమండలం జలాశయ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆయన వెల్లడించారు.

జలాశయం ద్వారా ఉద్దాన ప్రాంతంతో పాటు పలు నియోజకవర్గాలకు శాశ్వత మంచినీటి పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ధీమా వ్యక్తం చేశారు. జల జీవన్ మిషన్ ద్వారా ప్రజలకు మంచినీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, దీనివల్ల పాతపట్నం, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాలకు సాగు, మంచినీటి లభ్యత పెరుగుతుందని వివరించారు. ఈ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆయన ఆదేశించారు.

Leave a Reply