నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇచ్చారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా నటిస్తున్న మూవీ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్పై డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ఆయన భార్య గీత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన తెలుగమ్మాయి వీణారావు హీరోయిన్గా నటిస్తుండగా.. వీరిద్దరినీ తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు వైవీఎస్ చౌదరి.
నారా భువనేశ్వరి హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టి మూవీని ప్రారంభించారు. ఈసందర్భంగా భువనేశ్వరితో పాటు లోకేశ్వరి, పురంధేశ్వరి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. ఇక కథ విషయానికి వస్తే.. ఇది 1980 నేపథ్యంలో సాగే స్టోరీ అంటా. తెలుగు భాషకు పెద్దపీట వేస్తూ.. హైందవ సంస్కృతి, తెలుగు భాష గొప్పతనం గురించి ఈ మూవీలో చూపించనున్నట్లు వై.వి.ఎస్ చౌదరి తెలిపారు. అలాగే ఈ మూవీకి నేపథ్యమే బలమని తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తారక రామారావుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఎన్టీఆర్ గొప్ప విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. “తారక రామారావు ఇండస్ట్రీలో అడుగుపెడుతోన్న సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్టీఆర్ గొప్ప విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను” అని సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.
హీరో తారక రామారావు మాట్లాడుతూ… “మా ముత్తాత ఎన్టీఆర్, మా తాత హరికృష్ణ, మా నాన్ని జానకీరామ్ ఆశీస్సులు ఎప్పుడూ నాతోనే ఉంటాయని నమ్ముతున్నాను. ఈ రోజు నా కుటుంబసభ్యులందరూ నన్ను ప్రోత్సహించడానికి ఇక్కడి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ప్రేక్షకుల ప్రేమాభిమానాలే నన్ను ముందుకు నడిపిస్తాయని నమ్ముతున్నాను. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటినుంచి మీడియా ఎంతో సహకరించింది. వారందరికీ కృతజ్ఞతలు” అని అన్నారు.
కాగా, మూవీ ప్రారంభత్సవ కార్యక్రమానికి నారా భువనేశ్వరి, దుగ్గబాటి పురందేశ్వరి, గారపాటి లోకేశ్వరి హాజరయ్యారు. నారా భువనేశ్వరి హీరోహీరోయిన్లపై క్లాప్ కొట్టి అభినందించారు. తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ నటనలో ఎంత కీర్తి తెచ్చుకున్నారో తారక రామారావు కూడా అలానే ఎదగాలని ఆకాంక్షించారు.