రెండు నెలల్లోనే ఆధునిక హంగులు..
34 గదులు, 320 టాయిలెట్స్ అభివృద్ధి…
డ్రెస్సింగ్ రూమ్పై వెంకటపతిరాజు సైతం కితాబు..
రెండు మ్యాచ్లు పూర్తయ్యాక ఎలివేషన్ పనులు..
అమరావతిని స్పోర్ట్స్ హబ్గా మారుస్తాం..
విజయనగరం, మూలపాడులో క్రికెట్ అకాడమీలు..
అమరావతి స్టేడియానికి జైస్వాల్ అనుమతి..
విజయవాడ ఎంపీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్..
(ఎస్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ) క్రికెట్ మ్యాచ్లకు విశాఖపట్నం స్టేడియంలో సర్వాంగ సుందరంగా రూపుదిద్దామని ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) తెలిపారు. రెండు నెలల కాలంలోనే ఆధునిక హంగులు అమర్చామని ఆయన తెలిపారు. రెండు మ్యాచుల తర్వాత ఎలివేషన్ పనులు పూర్తిచేస్తామని వివరించారు. శుక్రవారం ఆయన విజయవాడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ల సహకారంతోనే ఏసీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యానన్నారు.
విశాఖ స్టేడియంలో మౌలిక వసతులు లేవని చెప్పడంతో జనవరి 20 నుంచి మార్చి ఒకటో తేదీనాటికి స్టేడియంలో ఆధునిక హంగులతో సౌకర్యాలను ఏర్పాటుచేశామని తెలిపారు. స్టేడియంలోని 34 గదులను అభివృద్ధి చేయడంతోపాటు, 320 టాయిలెట్లను కూడా ఆధునికీరించామన్నారు. స్టేడియంలో డ్రెస్సింగ్ రూమ్ చూసి స్వయంగా వెంకటపతిరాజు మెచ్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకులకు వినోదం పంచేలా స్టేడియం తీర్చిదిద్దామని, రెండు మ్యాచ్లు పూర్తయ్యాక ఎలివేషన్ పనులు పూర్తి చేస్తామని ఎంపీ చెప్పారు. అన్ని ఫ్లడ్ లైట్ల ఏర్పాటుతో పాటు రెండు నెలల కాలంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
స్పోర్ట్స్ హబ్గా అమరావతి
అమరావతిని కూడా స్పోర్ట్స్ హబ్ గా అభివృద్ధి చేస్తామని కేశినేని చిన్ని తెలిపారు. ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తించి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామన్నారు. ఏపీలో క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ కూడా సహకారం అందిస్తుందని చెప్పారు. అదేవిధంగా అమరావతిలో స్టేడియానికి జైస్వాల్ అనుమతి కూడా మంజూరు చేశారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది 30 గ్రౌండ్లను అభివృద్ధి చేయడమే ఏసీఏ లక్ష్యమని ఆయన ప్రకటించారు. త్వరలో విజయనగరం, మూలపాడుల్లో క్రికెట్ అకాడమీలు ఏర్పాటుచేయనున్నట్లు ఎంపీ చిన్ని వివరించారు. ఏసీఏ ఆధ్వర్యంలో ఏపీ నుంచి ఉత్తమ క్రికెటర్లను తయారుచేస్తామని ఆయన స్పష్టం చేశారు.