ఆపరేషన్ సిందూర్ వివరాలు వెల్లడించిన రాజనాథ్ సింగ్
భారత్ భూభాగం నుంచే దాడులు
భారత్ గగనతలం నుంచి రాఫెల్ విమానాల ద్వారా మిస్సైల్స్ ప్రయోగం
ముందుగా నిర్దేశించని తొమ్మిది ఉగ్ర క్యాంపులపై మెరుపు దాడులు
మొత్తం తొమ్మిది క్యాంపులు ధ్వంసం
100 మందికిపైగా ఉగ్రవాదులు హతం…200 మందికి పైగా గాయాలు
త్రివిద దళాలను అభినందించిన అఖిల పక్ష నేతలు
న్యూ ఢిల్లీ – పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు అన్ని పార్టీలు ఏకగీవ్రంగా మద్దతు ప్రకటించాయి.. ఉగ్రవాద పోరులో మోదీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న అన్ని పార్టీలు ప్రకటించాయి..
ఆపరేషన్ సిందూర్ గురించి అన్ని రాజకీయ పార్టీలకు వివరించడానికి కేంద్రం గురువారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఉదయం 11 గంటలకు రాజ్నాథ్ అధ్యక్షతన అన్ని పార్టీల నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశం రెండు గంటల పాటు సాగింది.

ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, జై శంకర్, కిరణ్ రిజిజు సహా పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ నుంచి సందీప్ బందోపాధ్యాయ, డీఎంకేకు చెందిన టీఆర్ బాలు సమావేశంలో పాల్గొన్నారు.
ఇతర ప్రతిపక్ష నాయకులలో సమాజ్వాదీ పార్టీకి చెందిన రామ్ గోపాల్ యాదవ్, ఆప్కు చెందిన సంజయ్ సింగ్, శివసేన (యూబీటీ)కి చెందిన సంజయ్ రౌత్, ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన సుప్రియా సులే, బీజేడీకి చెందిన సస్మిత్ పాత్రా, సీపీఐ(ఎం)కి చెందిన జాన్ బ్రిట్టాస్ ఉన్నారు. ఈ సమావేశంలో పాక్పై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను రక్షణ మంత్రి పంచుకున్నారు.
తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం…

ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ మాట్లాడుతూ, త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వివరాలను వివరించారు. ముందుగా నిర్దేశించిన తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై మన దళాలు మెరుపు దాడి చేశాయన్నారు.. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం నేలమట్టం చేసిందన్నారు. పక్కా సమాచారంతో, అత్యంత కచ్చితత్వంతో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశామన్నారు. పాక్ మిలటరీ స్థావరాల జోలికి వెళ్లలేదని తెలిపారు. సైనిక శిబిరాలపై దాడి చేస్తే యుద్ధానికి దారితీస్తుందనే ఉద్దేశంతో కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని మెరుపుదాడులు జరిపినట్లు వివరించారు రాజ్ నాథ్. ఈ ఆపరేషన్ మొత్తం భారత సరిహద్దుల నుంచే నిర్వహించినట్లు తెలిపాయి.
భారత సైన్యం ఈ ఆపరేషన్ను భారత గగనతలం నుంచే నిర్వహించిందని , పాక్ భూభాగంలో అడుగుపెట్టలేదని చెప్పారు. సరిహద్దు నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నాయి. ఇందుకోసం రాఫెల్ యుద్ధ విమానాలతో పాటు స్కాల్ఫ్ క్రూయిజ్ మిసైల్స్, ఖచ్చితత్వంతో కూడిన గైడెడ్ బాంబులు, హరోప్ కామికేజ్ డ్రోన్ల వంటి అధునాతన ఆయుధాలను ఉపయోగించినట్లు వివరించారు. వాటితో ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా నేలమట్టం చేసినట్లు వెల్లడించారు. .
100 మందికి పైగా హతం
ఆధునిక యుద్దు విమానాలు క్షిపణులు ప్రయోగించి తొమ్మిది కీలక ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేశామన్నారు.. ఇప్పటి వరకు అందిన సమాచారం 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని, రెండు వందల మందికి పైగా గాయపడ్డారని తెలిపారు.. కేవలం తమ దాడులు ఉగ్రవాద క్యాంపులకే పరిమితం చేశామన్నారు.. పాక్ ఆర్మీ పోస్ట్ లకు గాని, సామాన్య ప్రజలకు గాని ఎటువంటి నష్టం కలుగకుండా మన దళాలలు తమకు అప్పగించిన పనిని దిగ్విజయంగా పూర్తి చేశాయన్నారు.. ఈ దాడులకు సంబందించిన వీడియోలను, ఫోటోలను ఈ సమావేశంలో ప్రదర్శించారు. కాగా, ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న త్రివిద దళాలకు అఖిలపక్ష నేతలు అభినందనలు తెలిపారు.

