Business Ladies | లేడీస్ బిజీ బిజీ Andhra Prabha News

Business Ladies | లేడీస్ బిజీ బిజీ Andhra Prabha News
గుంటుపల్లి రైజ్ కేంద్రంలో ‘ఏఐ ఫర్ ష్యూర్’ షురూ
ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంగా ముందడుగు
సొంత బ్రాండ్ రూపకల్పన,
డిజిటల్ మార్కెటింగ్పై ప్రాయోగిక శిక్షణ
మహిళల ఆర్థిక సాధికారతకు..
ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం చొరవ
ఆర్థిక సాధికారతకు విభిన్న వర్క్ షాపులు
ఆధునిక సాంకేతికత తోడుగా వ్యాపార విస్తృతికి వీలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
( ఇబ్రహీంపట్నం,, ఆంధ్రప్రభ):
మహిళా వ్యాపారవేత్తలు భవిష్యత్ మార్కెట్ లీడర్లుగా ఎదిగేందుకు, ఆర్థిక సాధికారతను సుస్థిరం చేసుకునేందుకు ఎప్పటికప్పుడు విభిన్న వర్క్షాపులు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గుంటుపల్లిలోని రైజ్ కేంద్రంలో స్వయం సహాయ సంఘాల మహిళలకు సిటిల్లా ఏఐ ఏజెన్సీ (హైదరాబాద్) సహాయంతో ఆదివారం ఏఐ ఫర్ ష్యూర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా మహిళా వ్యాపారవేత్తలకు కృత్రిమ మేధస్సు వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు, తమ సొంత వ్యాపార బ్రాండ్లను రూపొందించడం, ఆన్లైన్ మార్కెటింగ్ కోసం ప్రమోషనల్ వీడియోలు తయారు చేయడం వంటి అంశాలపై ప్రాయోగిక శిక్షణ అందించారు. గుంటుపల్లికి చెందిన సంతోషి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా తమ వ్యాపారానికి ప్రత్యేక బ్రాండ్ను సృష్టించుకోవడం, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం వంటి విషయాలు నేర్చుకున్నామన్నారు. ఇది తమ వ్యాపార అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. సిటిల్లా ఏఐ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తీసుకున్న చొరవ అత్యంత ప్రశంసనీయమైనదన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏఐపై అవగాహనతో పాటు చేయూత అందించడం వల్ల వారు భవిష్యత్లో తమతమ వ్యాపారాల్లో ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ఎస్హెచ్జీ మహిళలు, అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
