AP | వయోజనులు గతానికి వారదులు, భవిష్యత్తుకు మార్గదర్శకులు… ద్రౌపది ముర్ము

కశింకోట, మే 2 (ఆంధ్రప్రభ ): తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించడం మన సంస్కృతిలో భాగమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం (మే 2, 2025) రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం జరిగిన ‘ఏజింగ్ విత్ డిగ్నిటీ’ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి హాజరయ్యారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ పోర్టల్ ప్రారంభం, సీనియర్ సిటిజన్స్ హోమ్‌ల వర్చువల్ ప్రారంభోత్సవం, సహాయాలు, సహాయక పరికరాలు పంపిణీ చేశారు. సీనియర్ సిటిజన్స్ సంక్షేమం కోసం ప్రతిజ్ఞ చేశారు.

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సీనియర్ సిటిజన్స్ హోమ్ ల వర్చువల్ గా ప్రారంభోత్సవంలో భాగంగా అనకాపల్లి జిల్లా కసింకోట మండలం జి.భీమవరం గ్రామంలో పావని సొసైటీ ఫర్ ది మల్టిపుల్ హ్యాండీక్యాప్డ్ అండ్ ఫాస్టిక్స్ వారిచే నిర్వహించనున్న సీనియర్ సిటిజన్ హోమ్ ను గౌరవ భారత రాష్ట్రపతి వర్చువల్ గా ప్రారంభించారు.

ఈసందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ… తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించడం మన సంస్కృతిలో భాగమన్నారు. నేటి పోటీతత్వం, వేగవంతమైన జీవితంలో, సీనియర్ సిటిజన్ల మద్దతు, ప్రేరణ, మార్గదర్శకత్వం మన యువతరానికి చాలా ముఖ్యమైనవని రాష్ట్రపతి అన్నారు. సీనియర్ సిటిజన్లకు ఉన్న అనుభవాలు, జ్ఞానం యువతరానికి సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయ పడుతుందన్నారు. వృద్ధులు గతానికి ఒక వారధి లాంటివారని, భవిష్యత్తుకు కూడా మార్గదర్శకులని రాష్ట్రపతి అన్నారు. మన వృద్ధులు తమ వృద్ధాప్యాన్ని గౌరవంగా, చురుగ్గా జీవించేలా చూసుకోవడం ఒక దేశంగా మన సమిష్టి బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా సీనియర్ పౌరులకు సాధికారత కల్పిస్తోందని, తద్వారా వారు జీవితంలోని అన్ని అంశాల్లో చురుకుగా పాల్గొనవచ్చన్నారు. వృద్ధుల ఆనందం, శ్రేయస్సు కోసం పౌరులందరూ తమను తాము అంకితం చేసుకోవాలని, వారి మార్గదర్శకత్వాన్ని విలువైనదిగా పరిగణించాలని, వారి విలువైన సహవాసాన్ని ఆస్వాదించాలని ఆమె కోరారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన మహిళలు, బాలలు, విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల, వయోవృద్దుల సంక్షేమశాఖ రాష్ట్ర కార్యదర్శి ఎ. సూర్యకుమారి మాట్లాడుతూ… కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో బారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ పోర్టల్, దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్ హోమ్‌ ల వర్చువల్ ప్రారంభోత్సవం జరిగిందని తెలిపారు. అందులో బాగంగా అనకాపల్లి జిల్లా కసింకోట మండలం జి.భీమవరం గ్రామంలో పావని సొసైటీ ఫర్ ది మల్టిపుల్ హ్యాండీక్యాప్డ్ అండ్ ఫాస్టిక్స్ వారిచే నిర్వహించనున్న సీనియర్ సిటిజన్ హోమ్ ను గౌరవ భారత రాష్ట్రపతి వర్చువల్ గా ప్రారంభించారన్నారు. సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షే్మ పధకాలు అమలు చేస్తున్నాయని, అందరూ ఈ పధకాలను వినియోగించుకోవాలని తెలిపారు.


పది సంవత్సరాల తరువాత ఈ సంవత్సరం రాష్ట్రానికి కొత్తగా 15 సీనియర్ సిటిజన్ గృహాలు మంజూరయ్యాయని తెలిపారు. సీనియర్ సిటిజన్స్ పధకాలు వినియోగించుకొనుటకు గాను అవసరమైన సీనియర్ సిటిజన్ కార్డులను గత నెలరోజులలో లక్ష కార్డులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్డులు అవసరవైున వారు వారి సంబంధిత గ్రామ/వార్డు సచివాలయంలో గాని, లేదా వయోవృద్దుల సంక్షేమశాఖ కార్యాలయంలోగాని, ఆన్లైన్ పోర్టలులో గాని ధరఖాస్తు చేసుకొని పొందవచ్చునని ఆమె తెలిపారు. సంవత్సరానికి అయిదు లక్షల రూపాయలు వైద్య ఇన్సూరెన్స్ సదుపాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబంలో వయోవృద్దులను జాగ్రత్తగా చూసుకోవాలని, వారి యోగ క్షేమాలు, బాగోగులు చూసుకోవలసిన బాద్యత వారి పిల్లలు, కుటుంబ సభ్యులపై ఉందన్నారు. వారికి అవసరమైన ఉపకరణాలు అందించుటకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల సంక్షేమశాఖ సంచాలకులు ఎ. రవిప్రకాష్ రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, వయోవృద్దుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు బి.ఆశయ్య, పావని సొసైటీ ఫర్ ది మల్టిపుల్ హ్యాండీక్యాప్డ్ అండ్ ఫాస్టిక్స్ నిర్వాహకురాలు డి.రజని, సెక్రటరీ ఎమ్. సత్యవాణి, మహిళా,శిశు సంక్షేమశాఖ ప్రోజెక్టు డైరెక్టరు కె. అనంతలక్ష్మి, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు.

Leave a Reply