- జీవో 49 రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల డిమాండ్
- డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
- మూతపడిన వ్యాపార దుకాణాలు
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : టైగర్ కారిడార్ (Tiger Corridor) పేరిట గిరిజనులు, గిరిజనేతరులు హక్కులకు విఘాతం కలిగించే జీవో 49 వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఆసిఫాబాద్ (Asifabad), కాగజ్నగర్ (Kagaznagar) అటవీ డివిజన్ లో 339 గ్రామాలపై ప్రభావం చూపే జీవో నెంబర్ 49 ను వ్యతిరేకిస్తూ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం నుండి ఆదివాసీ సంఘాల ప్రతినిధులు (tribal communities Representatives) ఆదిలాబాద్, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల ఎదుట బైఠాయించి ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో అటవీ అధికారుల పెత్తనం సహించేది లేదని నినాదాలు చేశారు.
తెల్లవారుజాము నుంచే…
ఆదిలాబాద్ (Adilabad) ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉదయం 4 గంటలకే ఆదివాసి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివాసులు బైఠాయించారు. బస్సులను కదలిని ఇవ్వకుండా అడ్డుకోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఉట్నూరు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ లో ఆర్టీసీ బస్సులు (RTC buses) డిపోకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం 12గంటల నుండి ఆర్టీసీ బస్సులు యధావిధిగా రోడ్డు ఎక్కాయి. మధ్యాహ్నం వరకు దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసి ఉంచగా, ఆ తర్వాత తెరుచుకున్నాయి. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు.
భూములపై హక్కులు కోల్పోతారు…
జీవో నంబర్ 49 అమలుతో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కోల్పోతారని సంగం రాష్టనాయకులు గోడం గణేష్ అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 49, టైగర్ జోన్ల ఏర్పాటు వల్ల ఆదివాసీలు తమ భూములను కోల్పోతారని, వారి జీవన విధానం దెబ్బతింటుందని ఆదివాసీ సంఘాల నేతలు పేర్కొన్నారు.
