- సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ కావ్య కృతజ్ఞతలు
ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ : హైదరాబాద్ మహానగరం తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ లోని మామునూరు విమానాశ్రయ అభివృద్ధి పనులకు చేపట్టేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 90 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అదనపు నిధులు మంజూరీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
మామునూరు ఎయిర్పోర్ట్ విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, రన్వే పొడిగింపు, లైటింగ్, సెక్యూరిటీ ఫెన్సింగ్ వంటి కీలక పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 90 కోట్ల నిధులను మంజూరు ఇస్తూ జీవో జారీ చేసిందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు.
వరంగల్ ప్రజల దీర్ఘకాల స్వప్నం అయిన మామునూరు విమానాశ్రయం త్వరలోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించబోతోందని ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత చొరవతో మరో అడుగు ముందుకు పడిందన్నారు. మామునూరు ఎయిర్ పోర్ట్ భూ సేకరణ నిమిత్తం ఇప్పటికే 205 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా ఎయిర్ ఫోర్ట్ అభివృద్ధి కోసమై అదనంగా మరో 90 కోట్లు విడుదల చేయడం పట్ల ఎంపీ డాక్టర్ కడియం కావ్య హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేసేందుకు గాను ప్రత్యేక దృష్టిని సారించడం అభినందనీయమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు. ఎంతో గొప్ప చారిత్రక ప్రాధాన్యం కలిగిన వరంగల్ నగర అభివృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయి అన్నారు. వరంగల్,హనుమకొండ, కాజీపేట ప్రాంతం అభివృద్ధికి మామునూరు ఎయిర్పోర్ట్ కీలక పాత్ర పోషిస్తుందని ఎంపీ డా.కడియం కావ్య అన్నారు. ఈ సందర్భంగా వరంగల్ ప్రజల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

