హైదరాబాద్: గోదావరి, కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న నిందలు, దందాలు, చందాలు.. ఇదే కాంగ్రెస్ పాలన అని విమర్శించారు. నీళ్ల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే దాన్ని పట్టుకొని దున్నపోతు ఈనిందని కాంగ్రెస్ వాళ్లు అంటే.. దాన్ని పట్టుకొని దుడ్డెని కట్టేయమని బీజేపీ వాళ్లు అంటున్నారని విమర్శించారు.
తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఇచ్చిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమానికి శీర్షిక నీళ్లు, నిధులు, నియామకాలు. అందుకే పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వం ఈ మూడు రంగాల్లో సంపూర్ణమైన న్యాయం చేసింది. నీళ్ల విషయంలో కృష్ణా, గోదావరిలో ప్రతినీటి బొట్టును ఒడిసిపట్టి చుక్క నీటిని వదలకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కాలంతో పోటీపడి కట్టినా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని దాదాపు 90 శాతం పూర్తిచేసినా, సీతారామ ప్రాజెక్టును కూడా 90 శాతం పూర్తిచేసి తెలంగాణ రైతాంగం ప్రయోజనం కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం పనిచేసింది. కానీ నేడు నీళ్లు, నిధులు, నియామకాలు అనే శీర్షిక ఎక్కడో పోయింది. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న నిందలు, దందాలు, చందాలు. బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని ఇది అంటు మండిపడ్డారు కెటిఆర్.
గుజరాత్లో మార్బీ అనే ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జి కూలి పోయి 140మంది చనిపోయినా ఏ ఎన్డీఎస్ఏ, ఏజెన్సీ పోదన్నారు కెటిఆర్. ఆ 140 మంది చావులకు ఫలానావాడు బాధ్యుడని ఏ ఏజెన్సీ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ మాట్లాడదని దుయ్యబట్టారు. బీహార్లో నాలుగు రోజులకి ఒక బ్రిడ్జి కూలిపోతున్నా అడిగే నాథుడు లేడన్నారు. . అదే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి రూ.100 కోట్లు నష్టం జరిగితే ఎన్డీఎస్ఏ రాదని, అలానే అవినీతి, కమీషన్ల కక్కుర్తితో ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలిపోయి 8మంది చనిపోయినా.. ప్రమాదం జరిగి 100 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేంద్రంలో ఉండే ఒక్క మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడరని అగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వట్టెం పంప్ హౌస్ మునిగిపోయినా, పెద్దవాగు ప్రాజెక్ట్ రెండుసార్లు కొట్టుకు పోయినా అడిగేవాడు లేడన్నారు.
కానీ కాళేశ్వరంలో 100 కాంపోనెంట్లు ఉంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే దాన్ని పట్టుకొని దున్నపోతు ఈనిందని కాంగ్రెస్ వాడు అంటే దాన్ని పట్టుకొని దుడ్డెని కట్టేయమని బీజేపీ వాళ్లు రెండు రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్టును వారి పార్టీ ఆఫీసులో తయారు చేశారు ప్రజలను భ్రమింపచేసే ప్రయత్నం చేశారు. దానికి తిరుగులేని విధంగా ఎల్ అండ్ టీ సంస్థ ఎన్డీఎస్ఏ నివేదికను తిరస్కరిస్తున్నామని స్పష్టం చెప్పింది. అది చెత్తబుట్టలో పడేయడానికి తప్ప ఎందుకు పనికిరాదని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీని కట్టిన సంస్థ పనికి రానిదైతే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అదే సంస్థతో ఎందుకు కట్టించారని రేవంత్ రెడ్డిని నిలదీశారు కెటిఆర్. కాంగ్రెస్ కార్యాలయాన్ని కూడా తెలంగాణ నుంచి పోయిన మూటలతో కట్టారని అందరికీ తెలుసన్నారు.
కాళేశ్వరం విషయంలో ఒకడేమో బట్టకాల్చి మీదేస్తుంటే.. మరొకడేమో తానా అంటే తందానా అంటున్నాడని కెటిఆర్ ఫైర్ అయ్యారు. . కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కలిసి తెలంగాణ బొండిగ పిసికే ప్రయత్నం చేస్తున్నారని ఆరో్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన పనిని కావాలని అపవాదులు వచ్చేవిధంగా అనుమానాలు కలిగేలా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మేడిగడ్డం పోయాం. దానిని వెంటనే రిపేర్ చేయాలని, నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ఇవ్వడం లేదని ఎన్డీఎస్ఏ యాక్ట్ కూడా చూపెట్టాం. ఓనరే రిపేర్ చేయాలని అందులో ఉంది. ప్రభుత్వం దానిని ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. రైతుల పొలాలను ఎండబెడుతున్నది. ఈ విషయంలో ప్రభుత్వం తన వైఖరిని చెప్పాలి. గోదావరి జలాల విషయంలో ఏపీ అనుమతుల్లేకుండా కడుతున్న ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రి మాట్లాడడు, బీజేపీ కేంద్ర మంత్రులు మాట్లాడరు, కాంగ్రెస్ బీజేపీ వాళ్లు నోరు తెరవరు. అందుకే గోదావరి, కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఏనాటికైనా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష.’ అని కేటీఆర్ అన్నారు.