Accident | దేవాడ-సోండో సమీపాన నలుగురి దుర్మరణం
- బ్రిడ్జిపై నుంచి పడిన కారు
- మృతులంతా కాగజ్ నగర్కు చెందిన ఒకే కుటుంబ సభ్యులు
- మరో ఇద్దరి పరిస్థితి విషమం
Accident | ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : మహారాష్ట్రలోని దేవాడ-సోండో సమీపంలో బ్రిడ్జి(Bridge)పై నుంచి కారు బోల్తా పడిన సంఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. నిన్న అర్ధరాత్రి దాటాక ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో వాహనంలో ఉన్న ముగ్గురు మహిళలు, ఒక బాలిక అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా కాగజ్నగర్కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు.
వైద్య సేవలకు వెళ్లి వస్తుండగా…
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా(Asifabad District) కాగజ్ నగర్ పట్టణానికి చెందిన ఒక కుటుంబం మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణానికి వైద్యం నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా దేవాడ సమీపంలోని బ్రిడ్జి పైనుండి వారు ప్రయాణిస్తున్న కారు కింద పడగా ముగ్గురు మహిళలు ఒక బాలిక ప్రమాద స్థలంలోనే చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతి చెందిన వారు కాగజ్నగర్ నిజాముద్దీన్ కాలనీకి చెందిన ఆటో నడుపుకొని జీవనం కొనసాగిస్తున్న జాకీర్ భార్య, సల్మా బేగం, కుమార్తె శబ్రీమ్, 14వ వార్డుకు చెందిన వారి బంధువులు ఇద్దరు మహిళలు ఆఫ్జా బేగం(Afza Begum), సహార కూడా మృతి చెందినట్లు జాకీర్ తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చంద్రపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

