ఎల్లారెడ్డి (ఆంధ్రప్రభ): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని మల్లయ్య పల్లి గేటు వద్ద మెదక్-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై బుధవారం రాత్రి 9 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించగా మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా పోపన్నపేట మండలం నర్సింగరావు పల్లి తాండకి చెందిన వారు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వారు మెదక్ నుండి ఎల్లారెడ్డి వైపు వస్తుండగా టీజీ 15 ఈ 1895 అనే నెంబర్ గల స్విఫ్ట్ డిజైర్ కారు అక్కడ హైవే నిర్మాణంలో భాగంగా కల్వర్టు పనులు కొనసాగుతు న్నాయి. వేగంగా ఉన్న కారు డ్రైవర్ ఇది గమనించకపోవడంతో అక్కడే ఉన్న పోచారం ప్రధాన కాలువలో పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో కారు డ్రైవర్ పీరియా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మిగతా క్షతగాత్రులను స్థానికుల సహాయంతో అంబులెన్స్ ద్వారా ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా ఆస్పత్రిలో మరొకరు మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు మరణించగా మిగతా ముగ్గురు కోమాలోకి వెళ్లినట్లు తెలిసింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని కారును తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సహాయక చర్యలను స్థానిక ఎస్సై బొజ్జ మహేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.పనులు జరిగే స్థలం వద్ద ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా ఇష్ట రాజ్యాంగ పనులు చేపడుతున్న సదరు కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.