నంద్యాల బ్యూరో, మే 1 (ఆంధ్రప్రభ) : నల్లమల్ల అటవీ ప్రాంతంలో నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో ఓ పెద్దపులి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దపులి మృతిచెంది దాదాపు 20రోజులు గడుస్తున్నప్పటికీ అటవీశాఖ అధికారులకు తెలియకపోవడం విశేషం. పెద్దపులి మృతిచెందిన 20 రోజుల తర్వాత అటవీ శాఖ అధికారులు కనుగొన్నారు.
ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ పరిధిలోని ఆత్మకూరు రేంజ్ లో పెద్దపులి మృతిచెందిన సంఘటనతో అటవీ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మృతిచెందిన పెద్దపులిని అటవీశాఖ అధికారులు రహస్యంగా దహనం చేస్తున్నట్లు సమాచారం. మృతిచెందిన పెద్దపులి కళేబరం కుళ్లిపోయి వట్టిగా ఎండిపోయినట్లు కూడా ఉందని కొందరు చూసినవారు చెప్పినట్లు సమాచారం. పెద్దపులి వేటగాళ్ల ఉచ్చులో పడి బలి అయ్యిందా?… లేక మరి ఏమైనా సంఘటనతో మృతి చెందిందా?.. అనే పలు అనుమానాలు అటవీ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. పెద్దపులి మృతిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని, అందుకు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎఫ్ఓ సాయిబాబా తెలిపారు. అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.
నల్లమల్ల అటవీ ప్రాంతంలో సుమారుగా కొన్ని వందల పులుల సంరక్షణ కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. మరి వాటి పర్యవేక్షణ ఏమైంది?…నల్లమల అటవీ ప్రాంతంలో ఇలా జంతువులు మరణించడంతో వన్యప్రాణుల సంరక్షణ కమిటీ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ వాటికి అనుసంధానంగా ఆత్మకూరు అటవీశాఖ సిబ్బంది సంరక్షణలో ఉన్నప్పటికీ పెద్దపులి మృతిచెంది 20 రోజులైనప్పటికీ వారికి సమాచారం లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని వణ్యప్రాణుల సంరక్షణ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు.