Water Dispute | ఎపి జలదోపిడి – మొద్దు నిద్ర వీడాలంటూ రేవంత్ రెడ్డికి హరీశ్ రావు క్లాస్
ఏపీకి నాగార్జునసాగర్ నీటిని తరలిస్తుంటే ఏం చేస్తున్నారు?
రోజూ సుమారు రెండు టీఎంసీల నీరు ఏపీకి చేరుతోంది
ఇలాగే కొనసాగితే నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం, హైదరాబాద్ కు తాగునీరు కూడా ఉండదు
దీనిపై రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు
శిష్యుడి సహకారంతో చంద్రబాబు ఈజీగా నీటిని తరలించుకుపోతున్నారు
జలదోపిడీ కేంద్రమంత్రి కిషన్రెడ్డికి కనిపించడం లేదా?
మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్.
హైదరాబాద్ – ఏపీకి నాగార్జునసాగర్ నీటి తరలింపుపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలని మండి పడ్డారు. ఇవాళ అయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ నుండి గత మూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్కు కుడి కాలువ ద్వారా 10,000 క్యూసెక్కుల నీరు తరలించబడుతోంది. రోజూ సుమారు రెండు టీఎంసీల నీరు ఏపీకి చేరుతోంది. ఈ తరలింపును ఆపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సాగర్ నీటిని ఏపీ తరలించడంపై అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టమైన విజ్ఞప్తి చేసేందుకు వెనుకడుగేస్తోందని విమర్శలు వస్తున్నాయి.
మౌనం వీడాలి..
అసెంబ్లీలో నాగార్జున సాగర్ వద్ద మోహరించిన సీఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి తీసుకోవాలని తీర్మానం చేసినప్పటికీ, వాటిని రద్దు చేయాలని కేంద్రాన్ని కోరే ధైర్యం తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. అంతేకాకుండా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కూడా ఈ అంశంపై మాట్లాడే ధైర్యం లేదని అన్నారు. మా మీద ఎగరాలంటే జానెడు జానెడు ముఖ్యమంత్రి ఎగురుతారని ఎద్దేవా చేసారు. ఇకనైనా మొద్దు నిద్ర వీడి రాష్ట్రములోని లక్షల ఎకరాల్లో ఉన్న భూములకు నీళ్లు అందేలా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. ఏపీ నీటిని తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి మౌనంగా ఉండటం అన్యాయమని, శిష్యుడు రేవంత్ సీఎంగా ఉన్నందునే చంద్రబాబు ఈజీగా నీటిని తరలించుకుపోతున్నారని హరీష్ అన్నారు. ఏపీ నీటి తరలింపుకు రేవంత్ రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నాడని, చంద్రబాబు కేంద్రంలో తన పలుబడిని ఉపయోగిస్తున్నారని.. తెలంగాణకు నీళ్ళు తెస్తారా? చంద్రబాబు ఒత్తడికి తలొగ్గుతారా? అని ప్రశ్నించారు.
ఏపీ జల దోపిడీ కనిపించడం లేదా ?
ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆలోచించాలని, రాష్ట్రం కోసం పనికి రాని కేంద్రమంత్రలు ఎందుకని అంటూనే.. ఏపీ జల దోపిడీ కిషన్ రెడ్డికి కన్పించటం లేదా అంటు ప్రశ్నించారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడంతో తెలంగాణ కోసం కొట్లాడేవారే లేరని, వెంటనే సాగర్ కుడి కాలువకు నీటి విడుదలను ఆపాలని కోరారు. ప్రభుత్వ మొద్దు నిద్ర వలన నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం, హైదరాబాద్ కు తాగునీరు కూడా ఉండదని గుర్తు చేసారు. ఏపీ నీటిని తరలించుకుపోతుంటే.. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కనీసం మాట్లాడటం లేదని, సీఎం రేవంత్ వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకవెళ్లి.. సాగర్ ను సీఆర్పీఎఫ్ కంట్రోల్ నుంచి తొలగించేందుకు కిషన్ రెడ్డి చొరవతీసుకోవాలని మాట్లాడారు.