- భూధార్ నంబర్ల కేటాయింపుకు ప్రణాళికలు..
- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నూతన నమూనాలు
- ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం ఈ నెలాఖరులోనే
- హౌసింగ్ బోర్డు ప్రాజెక్టుల సమస్యల పరిష్కారం
- కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా భూములకు భూధార్ నంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే, రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన వారసత్వం, ఇతర మ్యుటేషన్లకు సంబంధించిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల పనితీరును సమీక్షించారు. లైసెన్స్డ్ సర్వేయర్లు సర్వే చేసిన తరువాత, రెగ్యులర్ సర్వేయర్లు వాటిని స్క్రూటినీ చేసేలా చూడాలని ఆయన ఆదేశించారు.
కోర్ అర్బన్ ఏరియాలో నిర్మించనున్న 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల డిజైన్లను సీఎం పరిశీలించారు. ప్రతి కార్యాలయంలో పార్కింగ్, క్యాంటీన్, ఇతర మౌలిక సదుపాయాలు ఉండేలా, అలాగే ప్రజలకు స్నేహపూర్వకంగా, సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం ఈ నెలాఖరులోనే..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలిపారు. ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా, హైదరాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డుతో జాయింట్ వెంచర్గా ఉన్న ప్రాజెక్టుల్లో తలెత్తిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు.