- అందోల్ లో ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం చేపడతాం
- గ్రామీణ మహిళలు స్వయంశక్తితో ఎదగాలి
- కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం
జోగిపేట, జులై23(ఆంధ్రప్రభ) : అందోల్ నియోజకవర్గం (Andol Constituency)లో ప్రతి మండలానికి అన్ని సౌకర్యాలతో సమైక్య భవనాల నిర్మాణం (Construction of integrated buildings) చేపడతామని, ప్రభుత్వ స్థలాలు ఉన్నచోట వీటిని నిర్మిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) అన్నారు. మంగళవారం చౌటకూర్ మండల పరిధిలోని ఎమ్మెస్ ఫంక్షనల్ లో నిర్వహించిన అందోల్ నియోజక వర్గ స్థాయి ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మహిళా శక్తిని గుర్తించేందుకే ఈ విజయోత్సవాలన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో 200 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారని, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రభుత్వం రూ.6680 కోట్లు ఖర్చు చేసిందన్నారు. జిల్లాలో రూ.972 కోట్ల డ్వాక్రా రుణాలు అందించామని, 5లక్షల స్కూల్ యూనిఫామ్స్ డ్వాక్రా మహిళలతో తయారు చేయించి విద్యార్థులకు అందించామన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు తీసుకువచ్చిన ఘనత ఆనాడు, ఈనాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్ డీఈ పీడీ జ్యోతి, అందోల్ ఆర్డీవో పాండు, ఐకెపి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.