వెలగపూడి – రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కెసిరెడ్డికి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక సుమారు 12:30 గంటలకు న్యాయాధికారి భాస్కరరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం పోలీసులు కెసిరెడ్డిని విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించారు. అంతకుముందు, సిట్ అధికారులు రాజ్ కెసిరెడ్డికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, మంగళవారం రాత్రి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కరరావు ఎదుట హాజరుపరిచారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి తొలుత ఈ కేసును సీఐడీ కోర్టులో కాకుండా ఏసీబీ కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టారని ప్రశ్నించారు. ఓ దశలో రిమాండ్ను తిరస్కరించి, మెమోను సవరించి సీఐడీ కోర్టుకు వెళ్లాలని సూచించారు.
ఈ సమయంలో సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కల్యాణి తమ వాదనలు వినిపించారు. ఈ కేసు అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) పరిధిలోకి వస్తుందని, కాబట్టి ఏసీబీ కోర్టుకు విచారణ జరిపి రిమాండ్ విధించే అధికారం ఉందని స్పష్టం చేశారు. ఇదే కేసులో మూడో నిందితుడైన అప్పటి ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ను విచారించేందుకు పీసీ యాక్ట్ సెక్షన్ 17(ఏ) కింద అనుమతి లభించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, కెసిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగి కానందున, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో అధికారిక విధులు నిర్వర్తించనందున ఆయనకు సెక్షన్ 17(ఏ) అనుమతి అవసరం లేదని ఏజీ వాదించారు.
గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉంటూనే కెసిరెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులను ప్రభావితం చేశారని, నెలకు రూ. 50-60 కోట్లు చొప్పున ఐదేళ్లలో సుమారు రూ. 3,200 కోట్లకు పైగా మద్యం కంపెనీల నుంచి కమీషన్లు తీసుకునేలా పాలసీని రూపొందించడంలో కీలకపాత్ర పోషించారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ వాంగ్మూలాలు ఉన్నాయని తెలిపారు. సత్యప్రసాద్ను ఎంపీ మిథున్ రెడ్డి కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పిస్తామని చెప్పి ఏపీకి తీసుకొచ్చారని కూడా ప్రస్తావించారు. కేసు తీవ్రత దృష్ట్యా, లోతైన విచారణ అవసరమని, అందువల్ల కెసిరెడ్డికి రిమాండ్ విధించాలని కోరారు.
మరోవైపు, నిందితుడు కెసిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అసలు సిట్ ఏర్పాటు చట్టబద్ధం కాదని, ఏసీబీ కోర్టుకు రిమాండ్ విధించే పరిధి లేదని వాదించారు. సోమవారం కెసిరెడ్డికి ఇచ్చిన అరెస్ట్ మెమోలో పీసీ యాక్ట్ సెక్షన్లు లేవని, తాజాగా రిమాండ్ రిపోర్టులో వాటిని చేర్చారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కెసిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగి కానందున పీసీ యాక్ట్ వర్తించదని, రిమాండ్ను తిరస్కరించాలని కోరారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి భాస్కరరావు, నిందితుడు కెసిరెడ్డితో మాట్లాడారు. అరెస్ట్ కారణాలు వివరించారా, నోటీసులు ఇచ్చారా, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మే 6వ తేదీ వరకు రాజ్ కెసిరెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వెంటనే పోలీసులు ఆయన్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.