రెండు క్యాటగిరీలుగా కార్డులు
ఏప్రిల్ మొదటి వారం నుంచి పంపిణి
ఇప్పటికే కార్డుల తయారీకి టెండర్లు ఆహ్వానం
వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ – ఉగాది తర్వాత ఏప్రిల్ మొదటి వారం నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉండొచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రెండు కేటగిరీలుగా డివైడ్ చేసి కార్డులు పంపిణీ చేస్తామన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కార్డుల జారీలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికీ (బీపీఎల్) కార్డులు, ఎగువన ఉన్న వారికి (ఏపీఎల్) కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అపొహలు అవసరం లేదన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని స్పష్టంచేశారు. ఇప్పటికే పింక్ కార్డులు ఉన్న వారికి గ్రీన్ కలర్ కార్డులు, తెల్ల కార్డులు ఉన్న వారికి ట్రై కలర్ కార్డులు ఇస్తామన్నారు.
క్యూ ఆర్ కోడ్ లో కార్డులు
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధమవుతోంది. కొత్త కార్డులతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ రేషన్కార్డులను అందించేందుకు పౌరసరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కొత్త కార్డుల ముద్రణ కోసం టెండర్లను ఆహ్వానించగా.. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల దాకా టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించింది. ఈ నెల 26న సాంకేతిక, ఆర్థిక బిడ్లను తెరిచి, అర్హత సాధించిన వారికి కార్డుల ముద్రణ బాధ్యతలు అప్పగించనుంది. ఇందుకోసం 56 పేజీలతో కూడిన రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్ను (ఆర్ఎ్ఫపీ) టెండర్ నోటీసుతోపాటు జత చేసింది.
ఎటిఎం కార్డు తరహాలో..
కొత్తగా అందించనున్న రేషన్ కార్డులు గతంలో కంటే భిన్నంగా ఉండనున్నాయి. సైజు, కార్డుపై ముద్రించే వివరాల్లోనూ పౌరసరఫరాల శాఖ పలు మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త కార్డుల ముద్రణ కోసం ఇచ్చిన టెండర్ నోటీసులో ఆ వివరాలను పేర్కొంది. కొత్త కార్డులపై కుటుంబ పెద్ద పేరు మినహా ఎవరి ఫొటోలనూ పెట్టడం లేదు. 760 మైక్రాన్స్ మందం, 85.4మి.మీ పొడవు, 54మి.మీ వెడల్పు ఉండే పీవీసీ కార్డుపై రేషన్ కార్డు వివరాలను పొందుపర్చనున్నారు. దీని ప్రకారం కొత్త రేషన్కార్డు ఏటీఎమ్ కార్డు సైజులో ఉండనుంది. కార్డుకు ఒకవైపు ప్రభుత్వ లోగో, కుటుంబ పెద్ద వివరాలు, హోలోగ్రామ్, మరోవైపు కార్డుదారుడి పూర్తి చిరునామా, క్యూఆర్ కోడ్ ముద్రించనున్నారు.
మొత్తం కోటి 20 లక్షల కార్డులు..
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి కోటి, దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న వారికి 20లక్షల చొప్పున మొత్తం 1.20కోట్ల రేషన్ కార్డుల ముద్రణకు పౌరసరఫరాల శాఖ టెండర్లు పిలిచింది. కార్డుల సరఫరా పూర్తయ్యే వరకు లేదా రెండేళ్ల పాటు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది. కొత్త కార్డుల ముద్రణకు అయ్యే ఖర్చును పూర్తిగా తామే చెల్లిస్తామని టెండరు నోటీసులో పౌరసరఫరాల శాఖ తెలిపింది. బోగస్, నకిలీ కార్డులకు చెక్ పెట్టేందుకే క్యూ ఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టు తెలిసింది. క్యూఆర్ కోడ్తో ఇచ్చే కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలన్నా, తొలగించాలన్నా పెద్దగా ఇబ్బందేమీ ఉండదని, మార్పులు చేసిన వెంటనే కొత్త క్యూఆర్ కోడ్ను జనరేట్ చేసి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని అధికారిక వర్గాలు అంటున్నాయి.