Doctor | రోడ్డుప్రమాదంలో…

Doctor | రోడ్డుప్రమాదంలో…
Doctor | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్న వైద్యురాలు రోడ్డుప్రమాదంలో మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వైద్యురాలును డాక్టర్ ఎస్.మమతారాణిగా గుర్తించారు.
మట్టెవాడ ఎస్సై శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లికి చెందిన ఎస్.మమతారాణి వరంగల్ హంటర్రోడ్డులోని ఫాదర్ కొలంబో ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో పనిచేస్తున్నారు.
గతేడాది నారాయణపేట జిల్లాకు చెందిన డాక్టర్ రాఘవేంద్రతో ఆమెకు వివాహం జరిగింది. సోమవారం రాత్రి విధులు ముగించుకుని భర్త డాక్టర్ రాఘవేంద్రతో కలిసి బైక్పై ఇంటికి వెళ్తుండగా, ఏడు మోరీల కూడలి వద్ద వెనుక నుంచి వచ్చిన టిప్పర్ వారి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు.ఈ ప్రమాదంలో 9 నెలల గర్భిణీ అయిన డాక్టర్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
