72.69 cr | త్వరితగతిన పూర్తి చేయాలి…

72.69 cr | త్వరితగతిన పూర్తి చేయాలి…

  • జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

72.69 cr | కర్నూలు ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. బుదవారం ఉపాధి హామీ కింద జరుగుతున్న పనుల పురోగతి, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర తదితర అంశాలపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులలో భాగంగా జిల్లాలో మొత్తం 704 పనులు, 72.69 కోట్ల రూపాయల అంచనాతో మంజూరయ్యాయని, ఇందులో 634 పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు.

ఇంకా 70 పనులు ప్రారంభం కావాల్సి ఉందని, వీటిని ఈ శనివారం లోపు ప్రారంభించాలని కలెక్టర్ పంచాయతీ రాజ్ ఎస్ఈ ని ఆదేశించారు. కృష్ణగిరి మండలంలో 17 పనులు మంజూరు కాగా, 2 పనులు మాత్రమే ప్రారంభమయ్యాయని, మిగిలిన పనులను శనివారం లోపు ప్రారంభించాలని కలెక్టర్ పంచాయతీ రాజ్ ఇంజినీర్ ను ఆదేశించారు. అదే విధంగా పత్తికొండ, తుగ్గలి మండలాల్లో ప్రారంభం కాని పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. నిరక్షరాస్యులైన మహిళల కోసం నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కార్యక్రమంలో ద్వారా మొత్తం 8 పాఠాలు ఉండగా, ఇప్పటికే 7 పాఠాలు పూర్తయ్యాయని.

మిగిలిన ఒక పాఠాన్ని, రెండు వర్క్‌షీట్లను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మార్చి 15 వ తేదీన నిర్వహించబోయే పరీక్షకు 1,61,000 మంది అభ్యాసకులు తప్పకుండా హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలోని కమ్యూనిటీ హాల్, అంగన్‌వాడీ కేంద్రం లేదా పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా గుర్తించి, ఇన్విజిలేటర్లుగా పాఠశాల ఉపాధ్యాయులను లేదా అంగన్‌వాడీ టీచర్లను నియమించాలన్నారు. పరీక్ష ముగిసిన తర్వాత మార్కుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

PD DRDA, PD MEPMA, DEO మరియు ఇతర సిబ్బంది అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్, ఎంపిడిఓ లను ఆదేశించారు. కర్నూలు అర్బన్, ఆదోని అర్బన్ లో ఎక్కువ శాతం పెండింగ్ ఉందని సర్వేలో పురోగతి తీసుకొని రావాలని కలెక్టర్ సంబంధిత మున్సిపల్ కమిషనర్ లను ఆదేశించారు.

పి-4 కార్యక్రమం కింద నమోదైన బంగారు కుటుంబాలలో పెండింగ్ లో ఉన్న కుటుంబాల వెరిఫికేషన్ ను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, డ్వామా ఇంచార్జి పిడి మాధవి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply