భద్రాద్రి కొత్తగూడెం : ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితులై అరణ్యాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి మావోయిస్టులు (Maoists) మొగ్గు చూపుతున్నారని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 12మంది మావోయిస్టులు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఇందులో తొమ్మిది మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.
వీరితోపాటు 12 ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ… భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పోలీసులు 81 & 141 సీఆర్పిఎఫ్ బెటాలియన్ అధికారులు ఆదివాసి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితులై మావోయిజాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి మావోయిస్టులు మొగ్గు చూపెడుతున్నారన్నారు.
ప్రస్తుతం సీపీఐ మావోయిస్టు సాయుధ దళాల సంచారం తెలంగాణ (Telangana) , ఛత్తీస్ ఘడ్ (Chhattisgarh) రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నదని సరిహద్దు గ్రామ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టు దళాలకు సహకరించకూడదని విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా 2025 జనవరి నుంచి నేటి వరకు వివిధ కేడర్లలో పని చేస్తున్న 294మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగిందన్నారు. ఇకపైన ఎవరైనా లొంగిపోదలుచుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్, లేదా బంధువుల ద్వారా గాని, నేరుగా అధికారులను సంప్రదించి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా ఎస్పీ కోరారు.