AP | వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య

ఓర్వకల్, జూన్ 6 (ఆంధ్రప్రభ) : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ రమేష్ నాయుడు (45) దారుణహత్యకు గురయ్యారు. స్వగ్రామం నుంచి రాత్రి ఏడు గంటలకు మినరల్ వాటర్ కోసం నన్నూర్ నుంచి బైక్ పై వస్తుండగా మీదివేముల సమీపంలో గువ్వ తిప్పకొండ వద్ద రమేష్ ద్విచక్ర వాహనాన్ని ఆపి విచక్షణారహితంగా రాయితో కొట్టి చంపేశారు గుర్తుతెలియని దుండగులు. ఆయన బైక్ దిగి పారిపోయేందుకు ప్రయత్నించగా, వెంబడించి పొత్తికడుపుపై కత్తితో పొడిచారు. దీంతో రమేష్ నాయుడు కిందపడి పోవడంతో ఆయన ముఖంపై బండరాయితో విచక్షణారహితంగా… గుర్తుపట్టలేని విధంగా మోదడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు.

విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్ష్యులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని రమేష్ నాయుడు హత్య తీరును పరిశీలించి, సీఐ చంద్రబాబునాయుడుతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. రమేష్ నాయుడికి భార్య లక్ష్మీదేవితో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. తమ పార్టీ బుధవారం నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని, గ్రామంలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందునే టీడీపీ వర్గీయులు ఓర్వలేక ఆయనను హత్యచేశారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. గతంలో కూడా ఈయన ఇంటిపై దాడిచేశారన్నారు.

రాజకీయ నేపథ్యం..
రమేష్ నాయుడు మొదటి నుంచి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డికి సన్నిహితంగా మెలిగేవారు. ఇతని కుటుంబం మీద నాయకులకు అపారమైన నమ్మకం ఉండడంతో 2014 స్థానిక సంస్థల‌ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఆయన మంచితనం కారణంగా ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత 2019లో విశేషమైన సేవలు అందించారు. రమేష్ నాయుడు హత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు.

విచారణ చేపట్టిన పోలీసులు..
మీదివేముల ఎంపీటీసీ రమేష్ నాయుడు హత్య జరగడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రత్యర్థులు ఎవరున్నారు. రాజకీయ కక్షనా లేదా మరో ఏదైనా కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *