నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్సార్‌

ఉట్నూర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ 17వ వర్ధంతి వేడుకలు

ఉట్నూర్, ఆంధ్రప్రభ : దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉట్నూర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. నిర్మల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజలకు అందించిన సేవలను స్మరించుకున్నారు. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్సార్‌ చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు.

వైఎస్సార్‌ సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని నాయకులు అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్‌ డీసీసీ ఉపాధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ ఇక్బాల్‌, ఆదిలాబాద్‌ ఆర్టీఏ సభ్యుడు దూట రాజేశ్వర్‌, జైనూర్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బానోత్‌ జైవంత్‌రావు, ఉట్నూర్‌ పట్టణ అధ్యక్షుడు సయ్యద్‌ నిసార్‌, కాంగ్రెస్‌ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, బిరుదుల లాజర్‌, యువజన కాంగ్రెస్‌ నాయకుడు అరకిల్ల పరమేశ్వర్‌రావు, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు మహేందర్‌, నాయకులు రాములు, కోడి ప్రభాకర్‌, స్వామి, కైసర్‌, రాజు, ఉమేష్‌ తదితరులు పాల్గొన్నారు.