మహిళల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
మహిళల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
రెండు నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
తొర్రూరు, జూన్ 9, ఆంధ్రప్రభ: మహిళల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి పాలకుర్తి సంఘానికి, రాయపర్తి మండలానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.72 లక్షల విలువైన రెండు నూతన బస్సులను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళా సంఘాలు బలోపేతం కావడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు పెరిగేలా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
ఇందిరా మహిళా శక్తి సంఘాలకు అందించిన ఈ బస్సులు మహిళల సేవా కార్యక్రమాలకు, సంఘ కార్యకలాపాలకు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆ బస్సుల్లో మహిళా సంఘాల సభ్యులు సీఎం సభకు బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
