‘కాలవశంబు గాక, చావు శరీరము దాఁచఁ దప్పునే?’ యుద్ధభూమిలో కాసేపు ధైర్యంచేసి నిలబడి విజయాన్ని సొంతం చేసుకోవడం మాని, భీరువులై భయపడి పారిపోతారు ప్రాణంమీద తీపితో! రాసిపెట్టున్న మరణం దేహాన్ని దాచిపెట్టినందువలన రాకుండా పోతుందా? మరణం కాలవశమైనదన్న నిజం మరిచిపోయి పిరికివాడు పారిపోగా, ధైర్యవంతుడు యుద్ధరంగంలోనే నిలిచి పోరాడి సుఖం దక్కించుకుంటాడు, విజయం సాధిస్తే ఈ లోకంలో, లేకపోతే వీరమరణాన్ని కైవసం చేసుకుని పైలోకంలో అని దూబగుంట నారాయణకవి ‘పంచతంత్రం’ ప్రథమాశ్వాసంలోని ఒక సందర్భంలో మరణాన్ని గురించి, సాహసియైన మనిషి మరణంపై సాధించే విజయాన్ని గురించి మంచి అలోచన చేసి చెప్పాడు.
‘ఆయువస్థిరంబు నతి పేలవము పల్లవాగ్ర సలిల బిందువట్ల’ అన్నాడు మడికి సింగన ‘వాసిష్ఠరామాయణము’ ప్రథమాశ్వాసంలో. ‘ఆయువు అస్థిరమైనట్టిది. ఆలోచించగా ఆకు చివరను పట్టుకుని వేలాడుతూ కనిపించే నీటిబొట్టులా అతి పేలవమైనట్టిది ఆయువు. ఉండి ఉండి ఏదో విరక్తి కలిగినట్లుగా దేహాన్ని కాదనుకుని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది’ అని, హటాత్తుగా సంభవించే మరణాన్ని గురించి, సున్నితమైన ఊహచేసి చెప్పాడు.
‘సమర మొనరించినంతనే చావు రాదు, పాఱిపోయినయంతనే బ్రతుకు రాదు’ యుద్ధంలో పాల్గొన్నంత మాత్రాన మరణిస్తాడని కాదు. ప్రాణం పోతుందని భయపడి, యుద్ధం నుండి తప్పించుకుని పారిపోయినంత మాత్రాన ప్రాణం నిలుస్తుందనుకోవడానికి లేదు. జనన, మరణాలు దైవ కల్పితాలు. వాటికి సంతోషించడం, శోకించడం తగని పనులని మారన ‘మార్కండేయ పురాణం’లో చెప్పిన మాటలువాస్తవానికి దగ్గరగా ఉన్నవి, ఆచరణలో పెట్టదగినవి. ‘మరణంబున కిది నిమిత్తంబని నిరూపింపరాదు’ ఒకడు తీవ్రమైన ఆయుధం దెబ్బకు మరణిస్తాడు. ఒకడు ఎంతకూ నయం కాని జబ్బుతో దీర్ఘకాలం బాధపడి కాలంచేస్తాడు. ఇలా సంభవించే మరణాలు అర్థం చేసుకోగలిగినవి. మంచినీళ్ళు తాగుతూ, భోజనం చేస్తూ, ప్రశాంతంగా సేదదీరుతూ, శయ్యాసుఖం అనుభవిస్తూ కొందరు మరణిస్తారు. ఈ విధమైన మరణాలు ఊహించలేనివి. కనుక, ఫలానా వ్యక్తి విషయంలో మరణం ఫలనా కారణం వలన సంభవిస్తుందని చెప్పడానికి కుదరదు’ అన్న మాటలు కూడా మారన రచించిన ‘మార్కండేయ పురాణం’ లోనివే! ఈ నేపథ్యంలో, ‘దైవంబు చక్కఁజూచిన, నేవిధమునఁ గీడు వొంద దెయ్యెడ నున్నన్’ దైవానుగ్రహం ఉంటే ఎంతటి ప్రమాదకర పరిస్థితుల నుంచైనా శరీరం మీద ఒక్క చిన్న గీత కూడా పడకుండా బయటకొచ్చేయడం జరుగుతుంది. అదే దైవానుగ్రహం తప్పిన చోట, అది ఎంతటి సురక్షితమైన ప్రదేశమని భావించినప్పటికీ, అక్కడ ప్రాణానికి ముప్పు సంభవిస్తుంది అని సారాంశంగా చెప్పాడు మారన, మార్కండేయ పురాణంలోనే!
భార్య పిల్లలు, ధనధాన్యాలు చివరన తోడుగా రావడం ఎక్కడైనా జరుగుతుందా? జరగదు కదా! కాబట్టి, సజనహిత మగు నడవడినిఁ జనిన ధర్మము దనకుఁ దోడునీడను బోలున్’ ‘తనతోపాటే జీవనం గడుపుతూండే జనులలో ఎవరికీ ఏ కష్టమూ కలిగించకుండా, వారికి మేలుకలిగే విధంగా ప్రవర్తిస్తూ ధర్మబద్ధంగా జీవనం గడిపితే, చవరకు ఆ ధర్మమే నీడ వలె వెంటనే ఉండి తోడుగా వస్తుంది’ అని మరణం తరువాత కూడా తనను తెలిసిన వ్యక్తుల జ్ఞాపకాలలో చిరకాలం మిగిలి ఉండడానికి మార్గంగా విలువైన సలహా ఇచ్చాడు కొఱవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశిక’ కావ్యంలో. అలా, మరణాన్ని గురించి, మరణంపై మనిషి సాధించగలిగిన విజయాన్ని గురించి, పైన ఉదాహరించిన తెలుగు కావ్యాలలోని ఆయా కావ్యకర్తల మాటలు స్పష్టంచేశాయి.
- భట్టు వెంకటరావు