ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడుల వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టబోమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిపై రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల పిరికిపంద చర్యతో అమాయకులు ప్రాణాలను కోల్పోయారు. ఈ దుర్ఘటన నన్ను కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నాను. ఉగ్రవాదంపై దేశం సంకల్పాన్ని పునరావృతం చేయాలనుకుంటున్నాను. భారత్ను ఎవరూ భయపెట్టలేరు. ప్రభుత్వం అవసరమైన ప్రతి చర్య తీసుకుంటుందని దేశ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని మాత్రమే కాదు, తెరవెనుక ఉన్న ఎంతటివారినైనా ఉపేక్షించబోం. ప్రతీకారం తీర్చుకుంటాం అని హెచ్చరించారు.
ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా.. వారి వెనుక ఎవరున్నా..
ఉగ్రవాద దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు త్రివిధ దళాదిపతులతో రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎకె సింగ్ పాల్గొన్నారు.
ఈ సమావేశం తర్వాతే రాజ్ నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా.. వారి వెనుక ఎవరున్నా విడిచి పెట్టమంటూ ఘాటుగా వార్నింగ్ ….
మరో సర్జికల్ స్ర్టైక్ కు అడుగులు ..
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలతో కశ్మీర్, పీవోకేలో ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్? చేపట్టేందుకు సిద్ధమైందంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. సర్జికల్ స్ట్రైక్ కు చేసేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయనే సంకేతాలూ వినవస్తున్నాయి. అందుకు ఊతం ఇచ్చేలా ప్రధాని మోదీ,రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు వరుస సమావేశాలు నిర్వహించారు. హోం మంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఢిల్లీ చేరుకున్నారు. .ఇప్పటికే కశ్మీర్ పరిస్థితులను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని మోడీకి వివరించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు.కేంద్రం ఆదేశాల అమలుకు త్రివిధ దళాధిపతులు సిద్ధమనే సంకేతాలిచ్చారు. పహల్గాం ఉగ్రదాడి ప్రధానాంశంగా కేంద్ర కేబినెట్ సమావేశం కొద్ది సేపటి క్రితం మోడీ అధ్యక్షతన ప్రారంభమైంది. ముందుగా కేబినెట్ ఉగ్రదాడులలో మరణించిన వారికి సంతాపం తెలిపింది…