Wednesday, October 2, 2024

Mekalagandi Highway – మృత్యు ర‌హ‌దారి! – ఏడాదిన్న‌ర‌లో 13 మంది మృత్యువాత‌

ఆంధ్రప్రభ స్మార్ట్, ఆదిలాబాద్ : పచ్చని గుట్టల నడుమ వంపులు తిరిగే మేకల గండి మూలమలుపు ప్ర‌మాదాల‌కు నిల‌యంగా మారింది. మేకలగండి జాతీయ ర‌హ‌దారిలో ప్రయాణ‌మంటేనే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుంటున్నారు. జాతీయ రహదారి నిర్మాణ సంస్థ ముందుచూపు కొరవడి మూలమలుపు వద్ద రోడ్డు నిర్మాణం చేపట్టింది. గుడియత్నూర్ దాబా ఏరియా నుండి సీతా గొంది వరకు ఏటవాలుగా రహదారి స్లూపుగా ఉండడం వల్లే ఏమాత్రం వేగంగా వ‌చ్చిన వాహ‌నాలు ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నాయి. ఇక్క‌డ ప్ర‌మాదాన్ని హెచ్చ‌రిస్తూ ఎలాంటి బోర్డుల‌ను అధికారులు ఏర్పాటు చేయ‌లేదు.

ఏడాదిన్న‌ర‌లో 18 మంది మృతి
ఇక్క‌డ ఏడాదిన్న‌ర నుంచి చూస్తే ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌మాదాల్లో చిక్కుకుని 18 మంది మృతి చెందారు. గ‌తంలో 13 మంది మృతి చెంద‌గా, సోమ‌వారం అర్ధ‌రాత్రి త‌ర్వాత జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఐదుగురు మృత్యువాత ప‌డ్డారు. వరస ప్రమాదాలతో ప్ర‌జ‌లు బెంబేలెత్తుతున్నారు.

మేకల గండిని ఆక్సిడెంటల్ ప్రోన్ ఏరియా
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకల గండి మూలమలుపు మేకల గండిని ఆక్సిడెంటల్ ప్రోన్ ఏరియా గా రోడ్డు ర‌వాణా సంస్థ అధికారులు ప్ర‌క‌టించారు. 95 డిగ్రీల కోణంలో అస్తవ్యస్తంగా రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదాలకు హేతువుగా మారింది. జాతీయ భద్రత వారోత్సవాల్లో భాగంగా రోడ్డు రవాణా సంస్థ అధికారులు మేకల గండిని ఆక్సిడెంటల్ ప్రోన్ ఏరి యాగా ప్రకటించారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ అధికారులు మూలమలుపు వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్, హెచ్చరికల బోర్డులు, రంబుల్ ట్రిప్స్, అతివేగ పరిమితిని సూచించే బోర్డులు, 100 మీటర్ల దూరంలో ముందుగా ఎల్లో బ్లింకింగ్ లైట్ లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒకటి రెండు చోట్ల రంబుల్ ట్రిప్స్ సూచికలు తప్ప మరి ఏవి ఇక్కడ ఏర్పాటు చేయలేదు.

- Advertisement -

ఏడాదిన్నరలో 13 మంది బలి..
మేకలగండి మూల మలుపు వద్ద ఏటవాలుగా పల్లపు ప్రాంతంలో రహదారి నిర్మాణం ప్రమాదాలకు కారణమవుతోంది. అదిలాబాదు వచ్చి వాహనాలన్నీ అతివేగంగా వస్తు అదుపుతప్పి పక్కనే లోయలో పడుతున్నాయి. గత ఏడాది ఇంద్రవెల్లి మండలం కెస్లాగూడ కు చెందిన నలుగురు ఆదివాసి కుటుంబ సభ్యులు ఆటోలో వస్తూ అదుపుతప్పి బోల్తా కొట్టింది. డ్రైవర్ తో సహా నలుగురు మృతి చెందారు.


అంతేగాక ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పంచాయతీరాజ్ ఇంజనీర్ కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుండి వస్తూ రాత్రి వేళలో ఎర్టిగా వాహనం బోల్తా కొట్టి నలుగురు మృతి చెందారు. తాజాగా ఆదిలాబాద్ కు చెందిన సయ్యద్ మొయిజుద్దీన్ (67) తన కుటుంబ సభ్యులతో భైంసాకు వెళ్లి వస్తుండగా ఇదే చోట వాహనం పల్టీలు కొట్టి ఐదుగురు కుటుంబ సభ్యుల ప్రాణాలు రెప్ప‌ పాటులో గాలిలో కలిసిపోయాయి.

కలెక్టర్ చ‌ర్య‌లు తీసుకోవాలి
మేకల గండి మూలమలుపు రహదారి ప్రమాదాలకు నెలవుగా మారినా.. సంబంధిత అధికారులకు చీమ కుట్టినట్టైనా లేదు. ప్రమాద సూచిక బోర్డులు, ఇతరత్రా రహదారి నిబంధనలు పాటించకపోవడం నేపథ్యంలో మరిన్ని ప్రమా దాలు జరిగేందుకు ఆస్కారం ఉంది. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి మేకల గండి యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా పై దృష్టి సారించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement