Sunday, September 8, 2024

Cyber Crime : ‘క్ష‌మించు బావా… త‌ప్పు చేశాను’… అంటూ వివాహిత సూసైడ్

అప్పు చేయకుండా ఏదైనా చేశాం అంటే ధనికులుగా భావించవచ్చు. కానీ మధ్య తరగతి కుటుంబాలకు అప్పు చేయకుండా కాలం గడపడం కష్టం. అయితే అప్పు, లోన్ కావాలంటే బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. గడుస్తున్న కాలంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా ఫోన్ లలోనే యాప్ ల ద్వారా లోన్ పొందవచ్చు. వాటికి ఈ మధ్య ఎక్కువ అలవాటు పడిపోయారు. అయితే ఆ ఫోన్ లోన్ వల్ల ఎంత ఉపయోగం ఉందో అంత హాని కూడా ఉంది. దాన్ని ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.

కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడలో ఫోన్ లోన్ వివాహితను బలి తీసుకుంది. పేటేటి స్రవంతి(28)కి ఫోన్ లో రూ.5 లక్షలు రుణం ఇస్తామని ఒక సందేశం వచ్చింది. కుటుంబానికి ఉపయోగపడుతుందని ఆ నంబరును సంప్రదించింది. రూ.5 లక్షలు రుణం ఇచ్చేందుకు తొలుత రూ.20 వేలు, తర్వాత రూ.60 వేలు, వరుసగా రూ.80 వేలు చెల్లించమంటే అప్పు తెచ్చి ఓ లక్ష చెల్లించింది.

తర్వాత మరో రూ.1.20 లక్షలు చెల్లిస్తే మొత్తం రుణం ఇచ్చేస్తామంటూ మరో సందేశం రావడంతో తాను ఇక కట్టలేనని నిశ్చయించుకుంది. ఆ విషయాన్ని భర్త శ్రీకాంత్ కు చెప్పుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. భర్తను ఉద్దేశించి సెల్ఫీ వీడియో తీసి అందులో ‘బావా తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించు. నా ముఖం నీకు ఎలా చూపించగలను ? రుణం విషయంలో మోసపోయాను. నాకు భయంగా ఉంది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’అని జరిగిన విషయాన్ని శోకసంద్రంతో వివరించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement