Monday, September 16, 2024

Law and Order – ప్ర‌తి రెండు గంట‌ల‌కు రిపోర్ట్ ఇవ్వండి…

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – కోల్‌కతాలోని ఆర్జీ కార్‌ మెడికల్‌ కళాశాలలో జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనకు నిరసనగా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితులపై ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక సమర్పించాలని ఆయా ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

దేశంలోని అన్ని రాష్ట్రాలలోని పోలీసు ఉన్నతాధికారులు ప్రతి రెండు గంటలకు మెయిల్, ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా కేంద్రానికి నివేదికలు పంపాలని హోంశాఖ ఆదేశించింది. వాటి ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అయితే, హత్యాచారం జరిగిన ఆసుపత్రిలో సంబంధిత అధికారుల నుంచి సరైన సమాచారం, మద్దతు లేకపోవడం, పోలీసులు నిందితుడికి సహకరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును కోర్టు సీబీఐకు అప్పగించిందని పేర్కొంది.

కాగా ఈ ఘటన నేపథ్యంలో ఇటీవల దేశంలో అన్ని వైద్యకళాశాలలకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్ మార్గదర్శకాలు విడుదల చేసింది. జాతీయ స్థాయిలో డాక్టర్లు, వైద్య విద్యార్థులు, కళాశాల, ఆసుపత్రి పరిసరాల్లో భద్రతకు తగిన విధానాన్ని రూపొందించాలని సూచించింది. ఈ రక్షణ చర్యలు.. ఓపీడీ, వార్డులు, క్యాజువాలిటీ, హాస్టల్స్‌, నివాస ప్రాంతాలు సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లోనూ ఉండేలా చూడాలని తెలిపింది. వైద్యులు, సిబ్బంది కారిడార్లలో తిరిగే సమయంలోనూ భద్రత ఉండేలా తగినంత రక్షణ సిబ్బందిని ఏర్పాటుచేయాలని పేర్కొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement