Thursday, September 19, 2024

TG | యువ కార్మికులు త‌మ శక్తిని చాటాలి : సీఎండీ ఎన్.బలరామ్

సింగరేణిలో ప్రస్తుతం 50 శాతానికి పైగా యువత పనిచేస్తున్నారని.. ఈ యువశక్తి సంఘటితంగా తమ కృషిని ప్రదర్శిస్తే సంస్థకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని….. అలాగే రానున్న వచ్చే ఐదేళ్లలో 60 వేల టర్నోవర్ సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎండీ ఎన్.బలరాం తెలిపారు. సింగరేణి భవన్ లో మంగళవారం జరిగిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి వ్యాపార విస్తరణ దిశగా వేగంగా ముందుకు వెళ్తోందన్నారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో రాజస్థాన్ లో సోలార్ పవర్ ప్లాంట్, సింగరేణిలో మూసివేసిన ఉపరితల గనుల్లో పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, ఎస్టీపీపీలో మరో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ , ఒడిశాలో నైనీ బొగ్గు బ్లాక్కు సమీపంలో 1600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణం, రాష్ట్రంలో 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ తదితర అనేక వినూత్న ప్రాజెక్టులతో సింగరేణి ఉజ్వల భవితకు పునాదులు వేస్తున్నట్లు తెలిపారు.

అయితే సంస్థ అభివృద్ధికి, ఈ ప్రాంత యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ కల్పనలో కార్మికులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకుల తోడ్పాటు అత్యవసరమన్నారు. సమష్టిగా లక్ష్య సాధనకు కృషి చేస్తే దేశంలోనే అగ్రగామి సంస్థగా సింగరేణిని ఉన్నత స్థాయిలో నిలపడం సాధ్యమవుతుందన్నారు.

సింగరేణి బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఉద్యోగులంతా పనిచేయాలని, ఉత్పాదకతను పెంచడం ద్వారా తక్కువ ధరకు బొగ్గు సరఫరా చేయగలుగుతామని, తద్వారా విద్యుత్ వినియోగదారులపై భారాన్ని తగ్గించగలుగుతామన్నారు. పోటీ మార్కెట్ లో నిలదొక్కుకోవాలంటే నాణ్యత, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జీఎం(కో ఆర్డినేషన్) ఎస్.డి.ఎం.సుభానీ, జీఎం (మార్కెటింగ్) డి.రవి ప్రసాద్ అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement