Tuesday, July 2, 2024

TS: రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తాం… ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి

ఆగస్టు కాదు అంతకన్నా ముందే చేసి చూపిస్తాం.. రైతు రుణమాఫీని ఎవరూ ఆపలేరు
ప్రజాభిప్రాయం సేకరించి, విధి విధానాలు రూపొందించి, అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అమలు చేస్తాం
గత పాలకులు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 42వేల కోట్లు అప్పు తెచ్చి మిషన్ భగీరథ చేపట్టారు..
రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారు.. అయినా ఇంటింటికి తాగునీటిని ఇవ్వలేకపోయారు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తాం
రాష్ట్ర ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఉంటాం
గత పదేళ్లు పాలించిన వారు రాష్ట్ర సంపదను దోపిడీ చేసి, ఎవరికి పడితే వారికి పంచారు
రూ.7లక్షల కోట్ల అప్పు చేసి.. పారిపోయారు
రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నాం
త్వరలో శుభవార్త వింటారు
ప్రణాళికా బద్ధంగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
త్వరలో సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లు పారిస్తం
పైసా పైసా పోగుచేసి సంపదను సృష్టిస్తాం.. ఆ సంపదను రాష్ట్ర ప్రజలకే పంచుతాం
కొత్తగూడెం పాల్వంచ రెండు పట్టణాలు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు
స్థానికంగా ఐటీ హబ్ ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలిస్తాం
డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇవ్వదు ఇవ్వ‌దు అని ప్రచారం చేశారు, మేము ఒకేసారి 7,500 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశాం.. ఇప్పుడు రైతు రుణమాఫీ చేయరు.. చేయరు ..అని ప్రచారం చేస్తున్నారు.. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని చేసి చూపిస్తామని ఉప ముఖ్య‌మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం కొత్తగూడెం పట్టణంలో తాగునీరు, రహదారులకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్ని రకాల ఆటంకాలు ఉన్నా.. రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు చేసి చూపిస్తామని, ఆగస్టు కాదు అంతకన్నా ముందే చేసి చూపిస్తాం, ఈ కార్యక్రమాన్ని ఎవరు ఆపలేరని ఆయన అన్నారు.

ఇక రైతు భరోసా విషయానికొస్తే ఎవరికి ఇవ్వాలి, ఎలా పంపిణీ చేయాలి అన్నది ప్రజల నుంచి అభిప్రాయం సేకరించి, విధి విధానాలు రూపొందించి, అసెంబ్లీలో చర్చకు పెట్టి చట్టం చేసి కచ్చితంగా రైతు భరోసా ఈ రాష్ట్ర రైతులకు అందజేస్తామన్నారు. ప్రజల సొమ్ము నిరుపయోగం కాకుండా, ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఉంటామన్నారు. గత పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన నాయకులు ఖజానాను దోపిడీ చేశారు, ఎవరికి పడితే వారికి పంచారు.. 7 లక్షల కోట్ల అప్పు చేసి పారిపోయారని విమర్శించారు.

ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం మాత్రం రూపాయి రూపాయి పోగు చేసి అర్థవంతంగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తుందన్నారు. సంపదను సృష్టిస్తాం.. ఆ సంపదను రాష్ట్ర ప్రజలకు పంచుతామని ధీమా వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పేరుతో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి గత పదేళ్ళు పాలించిన వారు 42వేల కోట్లు అప్పు తెచ్చారు, అయినా ఇంటింటికి తాగునీరు రాని దుస్థితి నెలకొందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. కొత్తగూడెం పట్టణంలో తాగునీటి సరఫరాకు 150 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం వచ్చిందని, నల్గొండ జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి 150కోట్లతో తాగునీరు అందించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. కొత్తగూడెం, పాల్వంచ రెండు పట్టణాలను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు అవకాశం ఉంటే తప్పకుండా మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -

కొత్తగూడెం పట్టణానికి ఒకటే దారి ఉంది.. ట్రాఫిక్ జామ్ అయితే ఇబ్బందులు ఏర్పడతాయి… ఈ సమస్య పరిష్కారానికి బైపాస్ రోడ్డు నిర్మాణానికి గానూ స్థల సేకరణ కూడా పూర్తయిందని తెలిపారు. ఆర్ఓబీ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిధులు మంజూరు చేశారని, రాష్ట్రవ్యాప్తంగా ఆర్వోబీల నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. కావలసినంత స్థలం, నీరు, బొగ్గు అందుబాటులో ఉన్నందున రామగుండంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం, త్వరలోనే శుభవార్త వింటారని డిప్యూటీ సీఎం తెలిపారు.

కొత్తగూడెంలో ఐటీ హబ్ నిర్మాణానికి కావలసిన స్థలం ఏర్పాటు చేసేందుకు సింగరేణి యాజమాన్యంతో చర్చిస్తానని, టైర్ టు సిటీ, పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం అభివృద్ధికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడి ఐటి హబ్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత పాలకులు సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.9000 కోట్లు ఖర్చు చేసి ఒక ఎకరాకు కూడా నీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు.

ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల వివరాలన్నిటిని తెప్పించుకున్నాం, ఆరు నెలల్లో పూర్తి చేయగలిగేవి ఏంటి, ఏడాదిలో, మూడు సంవత్సరాల కాలంలో, ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్న అన్ని ప్రాజెక్టులను గుర్తించామని తెలిపారు. వీటినీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి సాగునీరందిస్తాం, త్వరలోనే సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని పారిస్తామన్నారు. రూ.70 కోట్లతో వైరా ప్రాజెక్టుకు లింకు కెనాల్ ను అనుసంధానం చేస్తున్నట్టు వివరించారు.

మంచినీటి స‌ర‌ఫ‌రా అభివృద్ధి ప‌థ‌కంకు శంకుస్థాప‌న‌…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమృత్ 2.0 124.48 కోట్ల నిధుల ద్వారా మంచినీటి సరపరా అభివృద్ధి పథకంకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావు తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement