Tuesday, October 1, 2024

TG: తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

త్వరలోనే తెలంగాణలో టీడీపీ పార్టీకి పునర్వైభవం తీసుకొస్తామని.. తెలంగాణ గడ్డపై పుట్టిన టీడీపీ పార్టీనీ మళ్లీ నిర్మిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు విజయం సాధించిన కూటమి తరపున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా నాలుగోసారి ఎన్నికయ్యారు.

ఈమేరకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు.. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబును టీడీపీ తెలంగాణ నేతలు ఘనంగా సన్మానించారు. అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.

రాష్ట్రంలో టీడీపీ నేటికి బలంగా ఉందని.. కీలక నేతలు పార్టీ మారినప్పటికీ కార్యకర్తలు మాత్రం పార్టీ మారలేదని.. త్వరలోనే తెలంగాణలో టీడీపీ పార్టీకి పునర్వైభవం తీసుకొస్తామని.. తెలంగాణ గడ్డపై పుట్టిన టీడీపీ పార్టీనీ మళ్లీ నిర్మిస్తామన్నారు. టీ టీడీపీ పార్టీనీ యువ రక్తంతో నింపుతానని సీఎం చంద్రబాబు తెలంగాణ నేతలకు హామీ ఇచ్చారు. అలాగే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని.. 2047 సంవత్సరం వరకు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

- Advertisement -

తెలుగుదేశం పార్టీని యుగపురుషుడు ఎన్టీఆర్ ఇదే గడ్డపై, ఇక్కడే ఎమ్మెల్యే కాలనీలో ప్రారంభించారని గుర్తుచేశారు. తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పేందుకు టీడీపీ పుట్టుకొచ్చిందని, ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని చంద్రబాబు చెప్పారు. తెలుగుజాతికి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్.. తెలుగువాళ్లను మదరాసీ అని పిలుస్తుంటే కాదు తెలుగుజాతి అనేది ఒకటుందని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. కరణం, మునసబు, పటేల్ పట్వారీ వ్యవస్థతో తెలంగాణ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలను ఎన్టీఆర్ తొలగించారని గుర్తుచేశారు.

ఆ వ్యవస్థలను ఎన్టీఆర్ రద్దు చేయడంతో మాకు స్వాతంత్ర్యం వచ్చిందని ఇక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలని, ఏ ప్రాంతంవైపు మొగ్గుచూపబోనని తాను చెప్పానన్నారు. రెండు ప్రాంతాల ప్రయోజనాల కోసం ఆలోచించి పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. . తెలుగుజాతి ఐకమత్యంతో ఉండాలని కోరుకుంటా, కలిసిమెలిసి ఉండాలనే నా చివరి రక్తపుబొట్టు వరకు ఆలోచిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement