Monday, July 1, 2024

TS: కొండగట్టు అంజన్నను దర్శించుకుని… మొక్కులు చెల్లించిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ ఇలవేల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని శ‌నివారం నాడు దర్శించుకున్నారు. అంజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వారాహి విజయ యాత్రకు ముందు వారాహి వాహనానికి కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం విదితమే. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించ‌డంతో తెలంగాణ, జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆలయానికి చేరుకున్నఆయ‌న‌కు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ప్రధాన స్థానాచార్యులు కపీంద్ర స్వామి పవన్ కళ్యాణ్ కి సంప్రదాయబద్దంగా తలపాగ చుట్టి ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీ ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇరు వైపులా ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవార్లకు అర్చనలు చేసిన అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించి, స్వామి వారి ప్రసాదం అందచేశారు.

తెలంగాణలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం

- Advertisement -

అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయానంతరం ఉప ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనానికి బయలుదేరిన పవన్ కి తెలంగాణలో జనసేన శ్రేణులు అడుగడుగునా ఘన స్వాగతం పలికాయి. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులు ఇచ్చి సాగనంపారు.

తుర్కపల్లి, శామీర్ పేట, సిద్ధిపేట, కరీంనగర్, గంగాధర తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు గజమాలలతో స్వాగతించారు. పవన్ కళ్యాణ్ గారి విజయానికి చిహ్నంగా తల్వార్ బహూకరించి జేజేలు పలికారు. పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు ప్రాంతం అంతా పార్టీ శ్రేణులు అభిమానులతో కిటకిటలాడింది. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు.

ఈ ప‌ర్య‌ట‌న‌లో పార్టీ ఉపాధ్యక్షుడు బి. మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, పార్టీ నాయకులు సాగర్, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, రాధారం రాజలింగం, వై.నగేష్, సంపత్ నాయక్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement