Monday, July 8, 2024

Protest – టిఎస్ పిఎస్సీ కార్యాల‌యం ముట్ట‌డి – నిరుద్యోగుల బైఠాయింపు

హైద‌రాబాద్ – గ్రూప్ పోస్టుల పెంపుదల, గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి, జాబ్ క్యాలెండర్, జీవో 46 రద్దు తదితర డిమాండ్లతో నిరుద్యోగులు పోరాటం చేస్తున్నారు.ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. 30 లక్షల మందితో ‘నిరుద్యోగ యాత్ర’ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రకటించింది. అయితే నిరుద్యోగ యాత్రపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పికెటింగ్‌లు నిర్వహించగా, టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిరసనను అడ్డుకునేందుకు వాటర్‌ క్యానన్లు ఏర్పాటు చేశారు. నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లలో కూడా తనిఖీలు చేస్తున్నారు. అమీర్ పేట్, ఆర్టీసీ క్రాస్ రోడ్, దిల్ షుక్ నగర్ మెట్రో స్టేషన్లలో ప్రయాణికులను తనిఖీ చేసి పంపుతున్నారు. మెట్రోలో టీజీపీఎస్సీకి వస్తామని పోలీసులు కాపలా కాస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు నిరుద్యోగ జేఏసీ, బీజేవైఎం నేతలను అరెస్టు చేశారు. నగరంలో పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

ఎస్‌ఎఫ్‌ఐ నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు ఎండీ సయ్యద్‌, జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ సుల్తాన్‌లను పోలీసులు అమ్రాబాద్‌ మండల కేంద్రంలో అదుపులోకి తీసుకున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. సేవాలాల్ సేన రాష్ట్ర కో-కన్వీనర్ బానావత్ హుస్సేన్ నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా బూర్గంపాడ్ స్టేషన్‌కు తరలించారు. అశోక్ నగర్, ఉస్మానియా తదితర యూనివర్శిటీలు, లైబ్రరీలు, స్టడీ సర్కిల్‌లు, స్టడీ రూమ్‌లలో పలుచోట్ల నిరుద్యోగ నేతలను పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ జిల్లాలో పలువురు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -

ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బోనగిరి మహేందర్, కార్యదర్శి యుగేందర్‌లను కూడా అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. హాజీపూర్ కూడలిలో సిద్ధాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి అచ్చంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సేవాలాల్ సేన రాష్ట్ర కో-కన్వీనర్ హుస్సేన్ నాయక్ సహా మరో 20 మందిని ముందస్తు అరెస్టు చేశారు. వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం కేతేపల్లికి చెందిన అర్జున్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన నగేష్‌లను వనపర్తి పట్టణ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement