Sunday, June 30, 2024

TS: సింగరేణిని కాపాడుకుంటాం.. కేటీఆర్

ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుంటామ‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రాంత నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమావేశమ‌య్యారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందన్నారు. కేంద్రంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కై బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నార‌న్నారు. లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆ తర్వాత సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్, బీజేపీ లు కుమ్మక్కై నవ్వుకుంటూ సింగరేణి గనులను అమ్మకానికి పెట్టినట్లు ప్రతి సింగరేణి కార్మికునికి అర్థమవుతోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలతో ఉద్యమ కాలం నాటి నుంచే పనిచేస్తున్నారన్నారు. సకల జనుల సమ్మె సమయంలో సింగరేణి ప్రాధాన్యతను దేశం గుర్తించిందన్నారు. సమ్మె కాలంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమైనయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తెలంగాణ ఉద్యమ కాలంలో అద్భుతంగా పనిచేశాయన్నారు. హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు గొప్పగా పనిచేశాయన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం అనేది మన పార్టీ విధానమ‌ని కేటీఆర్ అన్నారు. ఉద్యమ కాలం నుంచి…ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే త‌మ విధానమ‌న్నారు. అందుకే ప్రైవేటు కంపెనీలు ఎంత ఒత్తిడి తెచ్చినా పక్కకు పెట్టి… రైతు బీమాను ఎల్ఐసీ ఇచ్చామ‌న్నారు. విద్యుత్ ప్రాజెక్టులను కట్టే బాధ్యతలను బీహెచ్ఈఎల్ కి అప్పగించామ‌న్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్ల పాటు సింగరేణి సంస్థ అభివృద్ధి, విస్తరణ కోసం పనిచేశామో ప్రతి సింగరేణి కార్మికునికి అవగాహన ఉందన్నారు.

- Advertisement -

కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు తొమ్మిది సంవత్సరాలకు పైగా తెలంగాణ బొగ్గు గనులను వేలం వేయకుండా ఆపగలిగారన్నారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రెండు బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు కేటాయించినప్పటికీ… తట్టెడు తెలంగాణ బొగ్గును ఎత్తకుండా విజయవంతంగా అడ్డుకున్నామ‌న్నారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం… గెలిచి రెండు వారాలు కాకముందే బీజేపీ ఎంపీలు ఆ పార్టీ నాయకత్వం కలిసి తెలంగాణ బొగ్గు గనులను వేలంకు పెట్టాయన్నారు. తెలంగాణ గొంతుక పార్లమెంట్ లో లేదన్న భ్రమతోనే కాంగ్రెస్, బీజేపీలు ఈ కుటిల ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కానీ సింగరేణి కోసం ఆది నుంచి పోరాటం చేసి… సింగరేణిని బలోపేతం చేసిందే బీఆర్ఎస్ అన్నారు. సింగరేణి కష్టాల్లో ఉంటే కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న విషయం మర్చిపోతున్నారని కేటీఆర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement