Friday, October 18, 2024

TG | ఆ డ్రెస్సే వేసుకున్న భార్య… హత్య చేసిన భర్త

చైతన్యపురి: ఓ డ్రస్ గురించి భార్యభర్తల మధ్య గొడవ జరిగి.. భార్యను భర్త హత్య చేసిన ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి తెలిపిన వివరాలు… ప్రకాశం జిల్లాకు చెందిన గంజి వెంకటేష్, గంజి సోను (32) దంపతులు ఇద్దరు పిల్లలతో నగరానికి వచ్చి గడ్డిఅన్నారం సరస్వతీనగర్‌ కాలనీలో నివసిస్తున్నారు. వెంకటేష్‌ కూలిపని చేస్తుండగా సోను ఇళ్లలో పనిచేస్తుంది. వీరికి గోవిందరాజు (14), మురళీ కృష్ణ (11) ఇద్దరు కుమారులున్నారు.

గత మూడేళ్లుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం సోను పంజాబీ డ్రస్‌ వేసుకోగా వెంకటేష్‌ కు నచ్చలేదు. వద్దని వారించినా వినకపోవటంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.

ఈ దశలో వెంకటేష్ ఆవేశంగా కూరగాయలు కోసే చాకు తీసుకుని భార్యను కడుపులో, వీపుపై పొడిచాడు. దీంతో సోను రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మృతిచెందింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. భార్యపై దాడి చేసే సమయంలో వెంకటేష్‌ చేతికి స్వల్పగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement