Saturday, October 19, 2024

TG: మీ ఊరిలోనే బ‌డి మూత‌.. సీఎం సారూ.. ఇది సిగ్గు చేటు..

హైద‌రాబాద్ : ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఉపాధ్యాయుల్లేక‌ పాఠశాల మూతపడటం సిగ్గుచేటని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీశ్ రావు వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు… 15 రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేద‌ని అంటూ నిర్లక్ష్యానికి నిదర్శనమ‌ని మండిప‌డ్డారు.

ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ స్కూళ్లను మూతపడేలా చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.. ఇలా బ‌డులు మూసివేసి .. పేద పిల్లలకు ప్రాథమిక విద్యను దూరం చేస్తున్నారంటూ సీఎంను త‌ప్పు ప‌ట్టారు.

రాష్ట్రంలో పాఠశాలలు మూతపడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు ? విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నప్పటికీ విద్య పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు హ‌రీశ్.. తక్షణమే పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమించి పాఠశాలను మూతపడకుండా చూడాలని కోరారు, మూతపడ్డ పాఠశాలలను తెరిపించి విద్యా బోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హ‌రీశ్ డిమాండ్ చేశారు.

- Advertisement -

పప్పుధాన్యాల రైతుల‌నూ మోసం చేస్తున్నారు..

ఆహార పంటల బదులు పప్పుధాన్యాల సాగుతో మెరుగైన లాభాలు సాధించవచ్చన్న రైతుల ఆశలు అడియాశలు చేసేలా మీ ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటా పెసరకు మద్దతు ధర రూ.8,682 ప్రకటించినప్పటికీ ఆ ధరకు ఎవరూ కొనుగోలు చేయని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో వ్యవసాయ మార్కెట్లు, గ్రామీణ ప్రాంతాల వ్యాపారులకు పంటను క్వింటా రూ.6,000 నుంచి రూ.6,500 మధ్యనే రైతులు విక్రయిన్నారని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యాపారులు ఆడిందే ఆటగా మారటంతో రైతులు క్వింటాకు రూ.2,500 పైగా నష్టపోతున్నారన్నారు.

మ‌ద్ద‌తు ధ‌ర‌కు కొనేనాధుడే లేడు..
ఈ సంవత్సరం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం ప్రదర్శించడం పెసర పంట రైతులకు శాపంగా మారిందన్నారు. కష్టపడి పండించిన పంటను మద్దతు ధరకు విక్రయించే పరిస్థితి లేదని ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నారాయణ పేట, సూర్యపేట తదితర జిల్లాల రైతులు తీవ్ర ఆవేదన, ఆందోళన చెందుతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ఇప్పటికే రుణమాఫీ, రైతు బంధును అటకెక్కించిన మీ ప్రభుత్వం మద్దతు ధరకు అదనంగా రూ. 500 బోనస్ చెల్లిస్తామన్న మాటను బోగస్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

క‌ళ్లు తెరవండి.. మార్కెఫెడ్ ద్వారా కొనండి..

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు మంగళం పాడారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అదే తీరుగా ఇప్పుడు మద్దతు ధర ప్రకారం పంటలు కొనుగోలు చేసే బాధ్యతను విస్మరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో పంటలు పండించడం, పండించిన పంటలను విక్రయించుకోవడం రైతన్నకు కత్తిమీద సాముగా మారిందన్నారు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచుతున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలను వీడాలన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా పెసర కొనుగోలు కేంద్రాలు, జిల్లాల్లో తక్షణం ఏర్పాటు చేయాలన్నారు. రైతులు నష్టపోకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్న‌ట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement