Tuesday, October 22, 2024

TS: లొంగిపోయిన మావోయిస్టు దంపతులు.. రూ.8లక్షల రివార్డు అందజేత

వరంగల్ ఇన్చార్జి సీపీ అభిషేక్ మహంతి
కరీంనగర్ క్రైమ్ (ప్రభ న్యూస్) : మావోయిస్టు సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోయిన ఇద్దరు మావోయిస్టు దంపతులు వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు వరంగల్ ఇన్చార్జి కమిషనర్ అభిషేక్ మహంతి కరీంనగర్ కమిషనరేట్ ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మావోయిస్టు దంపతులు తిక్క సుష్మిత అలియాస్ చైతే
మడకం దూల అలియాస్ దూల పోలీసుల ఎదుట లొంగి పోయారన్నారు. లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు సెంట్రల్ కమిటీ మెంబెర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇంచార్జి వద్ద సుష్మిత సెంట్రల్ కమిటీ స్టాఫ్ గా, దూల ప్రొటెక్షన్ టీం మెంబర్ గా పనిచేశారన్నారు.


హన్మకొండ జిల్లా హాసన్ పర్తి మండలం సుదంపల్లి గ్రామానికి చెందిన తిక్క సుశ్మిత (27) ఇంటర్మీడియేట్ వరకు చదువుకుందని, తండ్రి తిక్క సుధాకర్ మావోయిస్టు సానుభూతిపరుడుగా పనిచేశాడన్నారు. అతన్ని చూసి ఆకర్షితురాలైన సుష్మిత తన చదువు అనంతరం 2016 సంవత్సరంలో ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కోమటిపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సమక్షంలో మావోయిస్టు పార్టీలో చేరిందన్నారు.

ఛత్తీస్ గడ్ రాష్ట్రం సుకుమా జిల్లా, పరియా గ్రామానికి చెందిన మడకం దూల అలియాస్ దూల ఐదవ తరగతి వరకు చదువుకున్నాడన్నారు. తన అన్నయ్య అయినా ఐయేత 2008 సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరాడని, అతన్ని చూసి ఆకర్షితుడైన దూల 2015 వ సంవత్సరంలో ఏరియా కమిటీ మెంబర్ అయిన జోగి ప్రోత్సాహంతో సిపిఐ మావోయిస్టు పార్టీలో చేరాడన్నారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి 2020 మార్చి నెలలో 30 వ తేదీన వివాహం చేసుకున్నారన్నారు.

- Advertisement -

తరువాత వివిధ హోదాల్లో పలు చోట్ల పనిచేశారన్నారు. మావోయిస్టు సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోయి, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకం గురించి తెలుసుకుని ఆకర్షితులైన మావోయిస్టు దంపతులు వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారన్నారు. వీరిరువురికి ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయలు నగదు రివార్డ్ వున్నదని 8 లక్షల రూపాయలు బ్యాంకు డీడీ రూపంలో వారికి అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో కాజిపేట ఏసీపీ తిరుమల్, హాసనపర్తి ఇన్స్పెక్టర్ సురేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement