Saturday, September 28, 2024

TGSRTC – ఇంధ‌నం ఆదా… జ‌ర్నీ జాదా…

ఆర్టీసీకి ఎల‌క్ట్రిక్ బ‌స్సులు
ఇంధ‌న భారాన్ని త‌గ్గించే దిశ‌గా
సుమారు 500 బ‌స్సులు
క్ర‌మ‌క్ర‌మంగా అన్ని డిపోలకు విస్త‌రించాల‌ని నిర్ణ‌యం
కొత్తగా 10 డిపోలు ఏర్పాటు
ఒక్కో డిపోకు రూ.10 కోట్లు
ప్ర‌ధాన బ‌స్టాండ్‌ల‌లో ఛార్జింగ్ సెంట‌ర్స్
పాత బ‌స్ డిపోల‌కు హైటెన్ష‌న్ విద్యుత్ స‌ర‌ఫ‌రా
ఖ‌ర్చులు త‌గ్గుతాయ‌ని భావిస్తున్న అధికారులు
ఆర్టీసీ ప్ర‌తిపాద‌న‌ల‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్
బ్యాంక్ గ్యారెంటీల‌కు ప్ర‌భుత్వ హామీ..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, హైద‌రాబాద్ః హైద‌రాబాద్ సిటీలో న‌డుస్తున్న ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌తో గ‌ణ‌నీయంగా ఆదాయం వ‌స్తుండ‌టంతో పాటు నిర్వ‌హ‌ణ‌ ఖ‌ర్చులు త‌గ్గ‌డంతో అధికారులు మ‌రింత ఉత్సాహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఎలక్ట్రిక్‌ బస్సుల్ని ప్రవేశపెట్టాలని ఆర్టీసీ భావిస్తోంది. సుమారు అయిదు వంద‌ల బ‌స్సులను ద‌శ‌ల వారీగా రోడ్డుపైకి తీసుకురావాల‌ని బావిస్తుంది

కొత్త బస్సులు.. కొత్త డిపోలు

- Advertisement -

ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం నూతన డిపోలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అన్ని జిల్లాలకు ఎలక్ట్రిక్‌ బస్సుల్ని విస్తరిస్తున్న తరుణంలో కొత్తగా 10 బస్‌ డిపోలు అవసరపడతాయని ఆర్టీసీ తన ప్రతిపాదలనో తెలిపింది. గతేడాది ఆర్టీసీకి డీజీల్‌ రూపంలో మొత్తం రూ. 1522 కోట్ల ఖర్చయింది. ఇది మొత్తం ఖర్చులో 22.7 శాతం దీంతో ఇంధన భారాన్ని తగ్గించుకునే దిశగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు పెద్దపీట వేస్తోంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌- విజయవాడకు మాత్రమే ఎలక్ట్రిక్‌ బస్సులు నడపిస్తున్న ఆర్టీసీ ఇకపై జిల్లాలకు కూడా విస్తరించే ఆలోచనలో ఉంది.

ఒక్కో డిపోకు రూ.10 కోట్లు కేటాయింపు
కొత్తగా ఏర్పాటు చేయనున్న డిపోలకు ఒక్కో డిపో ఏర్పాటుకు రూ. 10 కోట్ల చొప్పున మొత్తం రూ. 100 కోట్లు.. అలాగే ఒక్కో డిపోకు 10 ఎకరాల చొప్పున‌ మొత్తం 100 ఎకరాల భూమి కావాలని ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరింది. ఇక ఎలక్ట్రిక్‌ బస్సులకు ఛార్జింగ్ కోసం 33 కేవీ హై టెన్షన్ విద్యుత్‌ సరఫరా అవసరమని ఆర్టీసీ ఆలోచిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే 10 డిపోలతో పాటు 19 పాత బస్‌ డిపోలకు హైటెన్షన్‌ విద్యుత్‌ సరఫరాకు మరో రూ.232 కోట్లు అవసరపడతాయని ప్రాథమిక అంచనా వేస్తోంది.

బ్యాంక్ గ్యారెంటీల‌కు ప్ర‌భుత్వ హామీ..
హైదరాబాద్‌లోని కోఠి, హయత్‌నగర్‌ వంటి 10 టెర్మినల్‌ పాయింట్లలో ఇంటర్మీడియట్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు అవసరమని చెబుతోంది ఆర్టీసీ. దీని కోసం ఒక్కోచోట 2 వేల చదరపు మీటర్ల స్థలం కావాలని.. ఇంటర్మీడియట్‌ ఛార్జింగ్‌ స్టేషన్లకు రూ.6 కోట్ల చొప్పున రూ.60 కోట్ల ఖర్చవుతుందని లెక్కలు వేసింది. ఈ ప్ర‌తిపాద‌న‌లు ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి పంపింది.. దీనికి సూత్ర‌ప్రాయంగా ఆమోదం ల‌భించిన‌ట్లు స‌మాచారం.. బ్యాంక్ గ్యారెంటీల‌కు ప్ర‌భుత్వ హామీ ఇచ్చే విధంగా ఆర్టీసీకి హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే భారీగా ఎల‌క్ట్రిక్‌ బ‌స్సులు పెద్ద సంఖ్య‌లో తెలంగాణ‌లో ప్ర‌ధాన మార్గాల‌లో తిర‌గ‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement