Monday, September 9, 2024

TG – బాసర ఆశ్రమంలో నాలుకపై బీజాక్షరం – అక్షరాభ్యాసంలో ఇదేం తీరు

మండిపడుతున్న పూజారులు
గురువారం ఆందోళనకు పిలుపునిచ్చిన పూజారులు
ఆలయ సంప్రదాయాలకు భంగం వాటిల్లుతుందని విమర్శలు
ఆగమశాస్త్రంలో ఈ విధానం ఎక్కడా లేదని వెల్లడి

సరస్వతీమాత కొలువైన బాసర క్షేత్రంలో ఓ ఆశ్రమం వివాదానికి తెరలేపింది. శాస్త్రీయంగా వస్తున్న అక్షరాభ్యాస కార్యక్రమానికి భిన్నంగా నాలుకపై బీజాక్షరం రాస్తూ అక్షర స్వీకార కార్యక్రమం చేపట్టింది. పలువురు తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆశ్రమ నిర్వాహకులను ప్రశ్నించగా సరైన సమాధానం రాలేదని బాసర సరస్వతీ దేవి ఆలయ పూజారులు చెబుతున్నారు. ఆగమశాస్త్రంతో పాటు పురాణాల్లోనూ ఇలాంటి విధానం ఎక్కడా లేదని, కాళిదాసుకు మాత్రమే అమ్మవారు నాలుకపై బీజాక్షరాలు రాశారని చెప్పారు. ఈ కొత్త పోకడకు తెరతీసిన ఆశ్రమంపై వారు మండిపడుతున్నారు.

ఆల‌య సంప్ర‌దాయానికి విరుద్ధం..

ఆలయ సంప్రదాయాలకు దీనివల్ల భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తంతును వెంటనే ఆపేయాలంటూ గురువారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు ఆలయ పూజారులు ప్రకటించారు. సరస్వతీ మాత మాలధారణ చేసిన భక్తులు, ఇతరులు కూడా పెద్ద సంఖ్యలో బాసర క్షేత్రానికి రావాలంటూ పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం భారీ ర్యాలీగా వెళ్లి ఆలయ ఈవోకు మెమోరాండం సమర్పిస్తామని వివరించారు. బాసర క్షేత్రంలో ఇలాంటి వింత పోకడలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. ఈ విషయంపై వెనక్కి తగ్గకుండా పోరాడతామని బాసర సరస్వతి అమ్మవారి ఆలయ పూజారులు స్పష్టం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement