Saturday, September 7, 2024

TG – పెద వాగు బాధిత రైత‌న్న‌లు అదుకుంటాం – మంత్రి తుమ్మ‌ల భ‌రోసా ..

అశ్వారావుపేట ,జూలై21( ప్రభ న్యూస్): భారీ వర్షాలతో గండిపడి చిన్నా భిన్నంఆయన పెదవాగు ప్రాజెక్టుని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా ప్రాజెక్టు గండిపడిన ప్రదేశాలను మంత్రి పరిశీలించి అధికారులతో మాట్లాడి రక్షణ చర్యలు గురించి, ప్రాజెక్టు పునఃనిర్మాణ పనులపై చర్చించారు. ఈ క్రమంలో రైతులతో తుమ్మల మాట్లాడారు.ఈ సందర్భంగా రైతులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ఈ ప్రాంత వ్యవసాయం పట్ల రైతుల పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉన్న మీకు మాత్రమే తమ బాధలు తెలుసునని తమకు న్యాయం చేయాలని తుమ్మల ఎదుట బాధిత రైతులు వాపోయారు.

ఈ విషయమై మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రాజెక్టుకు గండిపడి భారీ స్థాయిలో నష్టం జరగటం దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. వరద సమయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, స్థానికఎమ్మెల్యే, పోలవరం ఎమ్మెల్యేలు అహర్నిశలు శ్రమించి ఎటువంటి ప్రాణనష్టం కలగకుండా చూశారని వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తుమ్మలతెలిపారు. ప్రాజెక్టు పునర్ నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సంబంధిత ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే రైతులెవరు అధైర్య పడవద్దని పంట నష్టం, ఆస్తి నష్టం జరిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఇప్పటికే వ్యవసాయ అధికారులు పంట నష్టం సర్వేను ప్రారంభించడం జరిగిందని అన్నారు.

- Advertisement -

వరదల వలన కలిగిన నష్టం పై కలెక్టర్ తుదినివేదిక వచ్చిన తర్వాత బాధితులకు తప్పనిసరిగా నూటికి నూరు శాతం న్యాయం చేస్తామని మంత్రి బాధితులకు హామీ ఇచ్చారు. ఈక్రమంలో పలువురు బాధితులు తుమ్మల వాహనాన్ని చుట్టుముట్టి మీరే మాకు న్యాయం చేయాలని అడగగా ఈ విషయంలో ఎటువంటి సందేహాలు వద్దని తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతుకు నూటికి నూరు శాతం పరిహారం అందేల తాను కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ,జిల్లా ఎస్పీ బి రోహిత్ రాజు, ఆర్డీవో మధుసూదన్ రావు,తాసిల్దార్ వి కృష్ణ ప్రసాద్, పలువురు జిల్లా, మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement