Sunday, July 7, 2024

TG స‌మ‌యానికి రాకుంటే చ‌ర్య‌లే …. ఉద్యోగుల‌కు మంత్రి తుమ్మ‌ల వార్నింగ్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేప‌థ్యంలో ఉదయం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యవసాయ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగులు సమయానికి రాకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన వ్యవసాయశాఖ మంత్రికి ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయి. నిర్ధేశిత సమయానికి కొంతమంది ఉద్యోగులు మాత్రమే హాజరవ్వటంతో అసహనం వ్యక్తం చేశారు. రేపటి నుండి అందరు ఉద్యోగులు సమయానికి హాజరవ్వలని ఆదేశాలు జారీ చేశారు. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే కార్యాలయంలో ఉద్యోగుల హాజరుపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ఇక నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని మంత్రి తుమ్మల హెచ్చరించారు. సమయ పాలన లేకుండా ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాగే జరిగితే ఉద్యోగులపై చర్యలు తప్పవని మండిపడ్డారు.

అనంతరం ఆయ‌న త‌న డిపార్ట్ మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్ సి డి సి ద్వారా ప్రాంతీయ అవార్డుల పథకం కింద మంచి పనితీరు కనబర్చిన సహకార సంఘాలకు అవార్డుల ప్రదానం చేశారు. ఎంపికైన ప్రాథమిక సహకార సంఘానికి రూ. 25,000/- నగదు బహుమతి, సహకార మెరిట్‌కు ఎంపికైన ప్రాథమిక సహకార సంఘానికి రూ. 20,000/- నగదు బహుమతితో పాటు ప్రతి కేటగిరీ కింద సర్టిఫికెట్లు అందజేశారు.

- Advertisement -

కాగా, నిన్న ఆర్‌ అండ్‌ బీ సెక్షన్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆర్ అండ్ బీ విభాగంలో ఖాళీ కుర్చీలే దర్శనమివ్వడంతో షాక్ తిన్నారు. ఇవాళ తుమ్మలకు ఇలాంటి వాతావరణం కనిపించడంతో అధికారులపై సీరియస్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement