Sunday, October 6, 2024

TG – ఎందుకింత నిర్ల‌క్ష్యం – క‌ళ్లెదుటే తిరుగుతున్నా ప‌ట్టించుకోరా – ప్రభుత్వానికి హైకోర్టు క్లాస్

లీడ‌ర్ల‌ కేసు విచార‌ణ‌లో మ‌రీ ఇంత జాప్య‌మా
సమన్లు జారీ చేయడంలోనూ లేటెందుకు
ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ ఆల‌స్యం
నెల రోజుల్లో కేవ‌లం తొమ్మిది మందికే స‌మ‌న్లు
అసంతృప్తి వ్య‌క్తం చేసిన తెలంగాణ హైకోర్టు
ప్ర‌భుత్వాన్ని సూటిగా ప్ర‌శ్నించిన ధ‌ర్మాస‌నం

ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర ప్రజాప్రతినిధులు (లీడ‌ర్లు) దోషులుగా ఉన్న కేసుల్లో విచారణ జరుగుతున్న తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత నెల విచారణ నుంచి ఇప్పటి వరకు ఏ మాత్రం పురోగతి లేకుండా, ఎక్కడి కేసులు అక్కడే ఉన్నాయ‌ని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిందితులకు, సాక్షులకు సమన్లు జారీ చేయడంలో జాప్యమెందుకు జరుగుతోందని ప్రశ్నించింది. నెల రోజుల్లో కేవలం 9 సమన్లు మాత్రమే జారీ చేస్తారా ప్ర‌భుత్వం త‌ర‌పున వాదిస్తున్న అడ్వొకేట్ జ‌న‌ర‌ల్‌ని ప్రశ్నించింది. కళ్లెదుటే వారు తిరుగుతున్నా సమన్లు ఎందుకు జారీ చేయడం లేదని నిలదీసింది. ఈ మేరకు నిందితులకు, సాక్షులకు సమన్ల జారీకి తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను జులై 23కు వాయిదా వేసింది. భారత సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటై ఈ అంశాన్ని సుమోటో పిటిషన్‌గా స్వీకరించిన విషయం విదితమే.

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్​లో 115 కేసులు

ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌ కుమార్‌తో కూడిన ప్రత్యేక ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో హైకోర్టు రిజిస్ట్రీ తరఫు సీనియర్‌ న్యాయవాది జి.విద్యాసాగర్‌ హైకోర్టుకు స్థాయీ నివేదిక ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 115 కేసులు నేతలపై పెండింగ్​లో ఉన్నట్లు రిజిస్ట్రీ ఆ నివేదికలో పేర్కొంది. మరోవైపు 46 సమన్లు జారీ చేయాల్సి ఉందని తెలిపింది.

పురోగ‌తి ఎందుకు లేదు..

ఆ నివేదిక పరిశీలించిన ధర్మాసనం, కేసుల విచారణలో ఎలాంటి పురోగతి లేదని ప్రశ్నించింది. ఈ క్రమంలో అదనపు అడ్వొకేట్​ జనరల్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ జోక్యం చేసుకుంటూ సమన్ల జారీలో ఎందుకు జాప్యం జరుగుతుందో వివరాలు తెలుకుంటామని బదులిచ్చారు. వెంటనే జారీ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో ధర్మాసనం ఈ పిటిషన్​పై విచారణను జులై 23కు వాయిదా వేస్తూ కేసుల్లో నిందితులకు, సాక్షులకు సమన్ల జారీ చేయాలని, దానిపై పురోగతి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement