Saturday, September 7, 2024

TG – రేవంత్ చేతుల మీదుగా ‘కాటమయ్య రక్ష కిట్ల’ పంపిణి

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – గీత కార్మికులకు ‘కాటమయ్య రక్ష కిట్ల’ పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం లష్కర్‌గూడలో ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన సేఫ్టీ కిట్లను(కాటమయ్య రక్ష కిట్లు) లబ్ధిదారులకు అందజేశారు.హైదరాబాద్‌ ఐఐటీ తయారు చేసిన వీటిని బీసీ కార్పొరేషన్‌ ద్వారా అందించారు.

చెట్లు ఎక్కుతుండగా ప్రమాదాల బారిన పడకుండా ఈ కిట్లు ఉపయోగపడనున్నాయి. లష్కర్‌గూడ తాటివనంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈత మొక్క నాటారు. గీత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాటి వనాల పెంపును ప్రోత్సహించాలని సీఎంను గీత కార్మికులు కోరారు. ఇందు కోసం గ్రామంలో 5 ఎకరాలు కేటాయించాలన్నారు. తాటి వనాలకు వెళ్లేందుకు మోపెడ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

హయత్‌నగర్‌ వరకు త్వరలోనే మెట్రో రైలు

రియల్‌ ఎస్టేట్‌ పెరగడం వల్ల తాటి వనాలు తగ్గుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. వన మహోత్సవంలో భాగంగా తాటి చెట్ల పెంపకాన్ని పరిశీలిస్తామన్నారు. రోడ్ల పక్కన వీటిని నాటాలనే నిబంధన విధిస్తామని పేర్కొన్నారు.

”పేదలకు కూడా కార్పొరేట్‌ విద్య, వైద్యం అందాలని కాంగ్రెస్‌ ఆలోచించింది. అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాలు తెచ్చాం. కాంగ్రెస్‌ చేపట్టిన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్‌ వల్ల రంగారెడ్డి జిల్లా భూముల విలువ పెరిగింది. హయత్‌నగర్‌ వరకు త్వరలోనే మెట్రో రైలు కూడా వస్తుంది” అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

కాటమయ్య రక్షణ కవచం పనితీరును బుర్రా వెంకటేశం.. సీఎంకు వివరించారు. కార్యక్రమంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement